యాదాద్రి, డిసెంబర్ 15 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో ప్రసాదాల తయారీని ‘బోగ్’ (బ్లెస్పుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్) ప్రోగ్రాం రాష్ట్ర నోడల్ అధికారి జ్యోతిర్మయి, జిల్లా ఆహార భద్రత డెసిగ్నేటెడ్ అధికారి డాక్టర్ సుమన్ కల్యాణ్, జిల్లా ఆహార భద్రత అధికారి స్వాతితో కలిసి గురువారం పరిశీలించారు. ప్రసాదం తయారీ సిబ్బంది, ఆలయ సిబ్బందికి అహార భద్రతపై శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేశారు. సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రసాదాల తయారీలో వినియోగించే నీళ్లు, ముడి సరుకులను పరీక్ష నిమిత్తం సేకరించారు.
ఈ సందర్భంగా ప్రోగ్రాం రాష్ట్ర నోడల్ అధికారి జ్యోతిర్మయి మాట్లాడుతూ గతం లో ఎన్నడూలేని విధంగా ఆలయంలో భక్తులకు శుచి, శుభ్రతతో కూడిన ప్రసాదాలు, వంటకాలు అందించేలా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల సాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చర్యలు చేపట్టిందన్నారు. ఈట్ రైట్ ఇండియా ప్రచారంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కేంద్రం ప్రభుత్వం చేపట్టిందని, తొలి విడుతగా 6 ఆలయాలను ఎంపిక చేసిందని, అందులో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎంపికైందని తెలిపారు. ఆలయంలో ప్రసాదాల తయారీ, విక్రయాలు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఉంటే ‘బోగ్’ సర్టిఫికెట్లు అందించనున్నట్లు వివరించారు.
వారం రోజుల్లో ఢిల్లీ నుంచి కేంద్ర ఆహార భద్రత ప్రత్యేక బృందం వచ్చి తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి కావాల్సిన పనులను వెంటనే చేపట్టాలని ఆలయ అధికారుకు సూచించారురు. ఆలయంలో పారిశుధ్యం, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాల ఆధారంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.గీత, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, డీఈఓ దోర్భాల భాస్కర్శర్మ, ఈఈ రామారావు, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు, సూపరింటెండెండ్ రాజన్బాబు పాల్గొన్నారు.