నల్లగొండ ప్రతినిధి, మే1(నమస్తే తెలంగాణ) : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉపఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కూడా మొదలవుతుంది. మొత్తం 12 జిల్లాలతో కూడిన ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులంతా నల్లగొండ కలెక్టరేట్లోనే తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంది. నల్లగొండ కలెక్టర్ హరిచందన ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. దాంతో నామినేషన్ను దాఖలు చేసే అభ్యర్థులు సెలవు దినాలు మినహా మిగతా అన్ని ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నల్లగొండ కలెక్టర్ చాంబర్లో నామినేషన్ల స్వీకరణకు కావాల్సిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు.
2021 మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో తన శాసనమండలి సభ్యత్వ పదవికి గత డిసెంబర్లో రాజీనామా చేశారు. దీంతో 2027 మార్చి వరకు మిగిలిన పదవీకాలం కోసం ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 25న కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. నేటి నుంచి లాంఛనంగా నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. ఉదయం 11గంటలకు రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ హరిచందన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ వెంటే నామినేషన్ల కూడా స్వీకరణను ప్రారంభం కానుంది. ఈ నియోజకవర్గం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, వరంగల్ అర్బన్, రూరల్, జయశంకర్భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగాం పూర్తి జిల్లాలతో పాటు సిద్దిపేట జిల్లాలోని మూడు మండలాలతో విస్తరించి ఉంది. ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులంతా తమ నామినేషన్లను నల్లగొండ కలెక్టరేట్లోనే దాఖలు చేయాల్సి ఉంది. 10వ తేదీన నామినేషన్ల పరిశీలన అనంతరం 13వరకు ఉపసంహరణ గడువు విధించారు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా వెల్లడిస్తారు. ఈ నెల 27న పోలింగ్, జూన్ 5న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 600 పోలింగ్ కేంద్రాలు ఉండగా 4.61లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. ఇప్పటికే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న రంగంలోకి దిగగా బీఆర్ఎస్, బీజేపీల నుంచి ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రావచ్చని సమాచారం. ఈ నెల 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ అనంతరం మండలి ఎన్నికలపై అన్ని పార్టీలు పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి.