హుజూర్నగర్, ఏప్రిల్ 10: నియోజకవర్గంలోని మేళ్ళచెరువులో భూదాన్ భూమి ఆక్రమణకు గురైంది. సర్వే నెంబర్ 1057లో 150 ఎకరాల పేదలకు చెందిన భూదాన్ భూమిని మైహోం, కీర్తి సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వారికి ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతున్నారని, ప్రభుత్వ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక న్యాయవాది కమతం నాగార్జున మండల లీగల్ సర్వీస్ అధారిటీ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారదకు ఇటీవల ఫిర్యాదు చేశారు.
భూదాన్ బోర్డు సెక్రటరీ, సీసీఎల్ఏ కమిషనర్, కలెక్టర్ సూర్యాపేట, ఆర్డీవో హుజూర్నగర్, తహసీల్దార్ మేళ్ళచెరువు, పంచాయతీ కార్యదర్శి మేళ్ళచెరువు, జిల్లా పంచాయతీ అధికారి సూర్యాపేట, ఎస్సై మేళ్ళచెరువు, జిల్లా ఎస్పీ సూర్యాపేట, కీర్తి, మైహోం సిమెంట్స్ ఎండీలతో కలిసి మొత్తం 11మందిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పదేండ్లుగా 150 ఎకరాల భూదాన్ భూములను సిమెంట్ కంపెనీలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాయన్నారు.
ఆక్రమణలకు ప్రభుత్వం అధికారులు వత్తాసు పలుకుతున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని గతంలోనే హుజూర్నగర్ కోర్టులో ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది కమతం నాగార్జున తెలిపారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉండడం వల్ల గతంలో జిల్లా కోర్టు ఎటువంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది. ఇటీవల హైకోర్టులో తుది తీర్పు వెలువడడంతో మరలా భూదాన్ భూముల అన్యాక్రాంతం విషయం వెలుగులోకి వచ్చింది.
150 ఎకరాల భూదాన్ భూముల అన్యాక్రాంతంపై మళ్లీ న్యాయవాది నాగార్జున హుజూర్నగర్ మండల లీగల్ సర్వీస్ అధారిటీ జడ్జి వద్ద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వాదనలు విన్న సదరు సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 29న కోర్టుకు హాజరై సమాధానం దాఖలు చేయాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు.