మిర్యాలగూడ, జనవరి 19 : మండలంలోని తడకమళ్ల ప్రాథమిక సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్, వైస్ చైర్మన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దాంతో అవిశ్వాస తీర్మానం రద్దు చేస్తున్నట్లు జిల్లా అధికారి ప్రకటించారు. తడకమళ్ల పీఏసీఎస్లో 13 మంది సభ్యులు ఉన్నారు. అందులో 9 మంది సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టాలని డిసెంబర్ 20న జిల్లా అధికారికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు జనవరి 18న అవిశ్వాస తీర్మానానికి హాజరు కావాలని అధికారులు సభ్యులకు నోటీసులు అందజేశారు.
అయితే.. జిల్లా అధికారి అనారోగ్య కారణాల రీత్యా గురువారం జరుగాల్సిన సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేశారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సమావేశం నిర్వహించారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారులు వేచి చూసినా సభ్యులెవరూ హాజరు కాలేదు. సభ్యులు రాకపోవడంతో చివరికి అవిశ్వాసం వీగిపోయినట్లు జిల్లా సహకార అధికారి ఆర్.కిరణ్కుమార్ ప్రకటించారు.
ఈ అవిశ్వాస తీర్మానానికి డీఎస్పీ వెంకటగిరి పర్యవేక్షణలో ఒక సీఐ, నలుగురు ఎస్ఐలు, 50 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయా సొసైటీలు, మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలోనే నల్లగొండ మున్సిపాలిటీ, వెలిమినేడు పీఏసీఎస్ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో తడకమళ్ల సొసైటీకి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా కాంగ్రెస్ తన పంతాన్ని నెగ్గించుకోలేక అబాసుపాలైంది.