యాదాద్రి భువనగిరి, మే 24 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో యాదాద్రి భువనగిరి జిల్లాకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రా రెడ్డి మండిపడ్డారు. ఆదివారం భువనగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్ రెడ్డి గుట్టకు రావడం ఐదోసారి. జిల్లా అభివృద్ధికి రూ.400 నుంచి 500 కోట్లు ప్రకటిస్తారని, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇస్తారని జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఏం జరిగింది? అధికారుల ప్రోటోకాల్ లోపం వల్ల సీఎం ఒక మాట కూడా మాట్లాడలేదు. మొహం చాటేసి వెనుదిరిగారు. ఇది ప్రజల ఆశలపై నీళ్లు చల్లడమే కాదు… వారిని ఘోరంగా అవమానించడమే..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్వాపురం రిజర్వాయర్, గంధమల్ల రిజర్వాయర్ పనులు పడకేశాయని, ముంపు బాధితులకు నష్టపరిహారం ఇవ్వకుండా వారి ఉసురు పోసుకుంటున్నారన్నారు.
ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత, అధికారుల కోసం 15 నిమిషాల పాటు ఎదురు చూసిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా అని ప్రశ్నించారు. కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు.. అందరూ స్థానిక ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే భజనలో తరిస్తూ, సీఎం ఎకడ దిగుతున్నారో అనే సోయి కూడా లేకుండా నిద్రపోయారని దుయ్యబట్టారు. బాధ్యులైన వారిని సస్పెండ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘జిల్లాలో ల్యాండ్ మాఫియా, క్రషర్ మాఫియా తోకలాడిస్తుంటే అధికారులు కాపలా కాస్తున్నారని ఆరోపించారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలోని ఓ సర్వే నంబరులో ఉన్న ప్రభుత్వ భూమిని ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థ కాజేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చల్లూరు గ్రామంలోని సర్వే నెంబర్ 324లో ప్రభుత్వ అసైన్డ్ భూములను ఆక్రమించారని, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా క్రషర్ నడుపుతున్నారని, ఆధారాలు ఇచ్చినా కనీసం క్రషర్ వైపు కన్నెత్తి చూసిన వారే లేరని ఆరోపించారు.