యాదాద్రి, డిసెంబర్9: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో స్వయంభువుగా వెలిసిన నరసింహుడి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రగమశాస్త్రం ప్రకారం జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన గావించారు.
సాయంత్రం స్వామి, అమ్మవార్ల తిరువీధిసేవ, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు కనులపండువంగా నిర్వహించారు. సుదర్శన నారసింహ హోమం పంచరాత్రాగమశాస్త్ర రీతిలో సాగింది. ఉదయం ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ సుదర్శ నారసింహ హవనం జరిపారు. వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి గజవాహన సేవను చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా సాగింది.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులకు పలు ధపాలుగా సువర్ణపుష్పార్చన కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహించారు. పరమపవిత్రంగా నిర్వహించే సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధిసేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలోని ఊయలతో శయనింపు చేయించి లాలిపాటలు పాడారు. స్వామివారిని సుమారు 13 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకుని స్వామివారి ఖాజానాకు రూ. 19,86,124 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.