యాదగిరిగుట్ట, మే 17 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి నిత్యోత్సవాలు బుధవారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజ వాహనంపై వేంచేపు చేసి ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు.
అనంతరం లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరు కల్యాణ తంతు జరిపించారు. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్టించి నిత్య కల్యాణ తంతు జరిపించారు. మొదటగా సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. సాయంత్రం వేళలో స్వామివారి వెండి మొక్కు జోడు(విహార) సేవ, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో స్వామి వారి నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. స్వామివారిని 20వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ. 25,59,119 ఆదాయం సమకూరిందని ఈఓ ఎన్.గీత తెలిపారు.