యాదాద్రి, డిసెంబర్ 3 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు శనివారం శాస్ర్తోక్తంగా జరిపించారు. ఉదయం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణోత్సవం జరిపించారు. సుమారు గంటన్నర పాటు సాగిన వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం భక్తులు స్వయంభువుడిని దర్శించుకున్నారు. స్వామివారి నిత్యోత్సవాలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయం సందడిగా మారింది. స్వామివారిని సుమారు 20వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.42,43,101 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవం-2023లో భాగంగా కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు దేవస్థానం తీపికబురు అందించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తుగా టికెట్లను విక్రయించేందుకు అందుబాటులో ఉంచారు. రూ.3వే లు చెల్లించి యాదాద్రి కొండపైన గల ప్రధాన బుకింగ్ కార్యాలయంతో పాటు ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంచినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. ఆన్లైన్లో టికెట్లు తీసుకునే భక్తులు yadadritemple.telangana.gov.inలో సంప్రదించాలని సూచించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శ్రీవారిని ప్రభుత్వ విప్ దాస్యం వినయ్భాస్కర్ కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనం చేయగా, ఆలయ డీఈఓ దోర్భల భాస్కర్శర్మ స్వామివారి ప్రసాదం అందించారు.