యాదాద్రి జిల్లాలో 9 మైదానాల పనులు పూర్తి
14 చోట్ల కొనసాగుతున్న పనులు
మిగతావి అండర్ ప్రాసెస్లో..
భువనగిరి అర్బన్, జూలై 4 : క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు, వ్యాయామానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు, మున్సిపాలిటీల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ప్రభుత్వ స్థలాలు, వెంచర్లలో మున్సిపాలిటీకి అప్పగించిన స్థలాలను సుమారు అరెకరం నుంచి ఎకరం వరకు అధికారులు గుర్తించారు. ఒక్కో ప్రాంగణానికి ప్రభుత్వం రూ.4లక్షలు కేటాయించగా.. పలుచోట్ల పనులు వడివడిగా సాగుతున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉండగా.. వాటి పరిధిలో 52 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రూ.4లక్షలతో ఏర్పాటు చేస్తున్న ఈ మైదానాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, లాంగ్ జంప్, ఎక్సర్సైజ్, సింగిల్బార్, లాంగ్బార్లను ఏర్పాటు చేస్తున్నారు. స్థలాలను గుర్తించిన పలుచోట్ల పనులను ప్రారంభించారు. ఇప్పటికే 9 ప్రాంగణాల పనులు పూర్తి కాగా.. రెండు ప్రారంభమయ్యాయి. 14 చోట్ల పనులు కొనసాగుతున్నాయి. మిగతా వాటిల్లో కొన్నింటికి స్థలాలు గుర్తించగా.. మరికొన్నింటికి స్థల సేకరణ జరుగలేదు.
క్రీడాకారులను ప్రోత్సహించడం సంతోషకరం
రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ప్రాక్టీస్ చేయడానికి ప్రత్యేక కోర్టుల్లేక క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారు. పోటీల్లో రాణించలేకపోతున్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడంతో క్రీడలపై మరింత ఆసక్తి పెరుగనుంది. క్రీడలతోపాటు వ్యాయామం, రన్నింగ్కు ఈ స్థలం అందుబాటులో ఉంటుంది. రాయగిరి పాఠశాలలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – చింతల శంకర్, జాతీయ క్రీడాకారుడు, శాంతి స్పోర్ట్స్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ