మునుగోడు/కొండమల్లేపల్లి, డిసెంబర్ 3 : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం డబ్బులు చేతికి వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హడావిడిలో ఉన్నప్పటికీ అధికారులు ధాన్యం సేకరణపై కూడా దృష్టిసారించారు. దాంతో మండలంలో కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతుండగా.. ధాన్యం డబ్బులు సైతం పది రోజుల్లోపే రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి.
మునుగోడు మండలంలోని కచాలాపురం, మునుగోడు, ఊకొండి, గూడపూర్, కొరటికల్, కల్వలపల్లి, బీరెల్లిగూడెం, పులిపలుపుల, పలివెల, కొంపెల్లి, సింగారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తూ ధాన్యం సేకరణ చేపట్టారు. ప్రస్తుతం ధాన్యం సేకరణ దాదాపు పూర్తయింది. పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 1,824 మంది రైతుల నుంచి 83,913 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 714 మంది రైతుల నుంచి 32,205 క్వింటాళు,్ల ఐకేపీ ఆధ్యర్యంలో 1010 మంది రైతుల నుంచి 51,785 క్వింటాళ్లు సేకరించారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి దాదాపు సగం మంది రైతుల ఖాతాల్లో ఇప్పటికే డబ్బులు జమ అయ్యాయి.
కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో గుమ్మడవెళ్లి, పెండ్లిపాకల, చిన్న అడిశర్లపల్లి, కొండమల్లేపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఇప్పటి వరకు 357 మంది రైతుల నుంచి 54,787 బస్తాలు (21,915 క్వింటాళ్లు) ధాన్యం కొనుగోలు చేశారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోలు చేసి డబ్బులను వారం రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. దాంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.