చౌటుప్పల్, జనవరి 11 : సంక్రాంతి పండుగ నేపథ్యంలో 65వ నంబర్ జాతీయ రహదారి రద్దీగా మారనున్నది. ఈ నెల 12 నుంచి 17 వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు ఉమ్మడి జిల్లావాసులతోపాటు, ఏపీ ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్ప్లాజా వద్ద నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫాస్టాగ్ను తప్పనిసరి చేస్తూ సూచనలిస్తున్నారు. ఫాస్టాగ్ ఉంటే అర నిమిషంలో టోల్ప్లాజా దాటవచ్చు.. లేదంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోవాల్సిందే.. ఫాస్టాగ్ లేకు న్నా, పని చేయకున్నా టోల్ప్లాజా వద్ద రెట్టింపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కావున వాహనదారులు ముందే ఫాస్టాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఫాస్టాగ్ లేని వారి కోసం నగదు చెల్లింపు కోసం ప్రత్యేక కౌంటర్ ఉంటుందని, ఇక్కడ నాలుగైదు నిమిషాల సమయం పడుతుందని తెలిపారు.
చౌటుప్పల్ మండల వ్యాప్తంగా ట్రాఫిక్ నివారించేందుకు ఇద్దరు ట్రాఫిక్ సీఐలు, ముగ్గురు ట్రాఫిక్ ఎస్ఐలు, 30మంది ట్రాఫిక్ సిబ్బందిని కేటాయించారు. పంతంగి టోల్ప్లాజా వద్ద ట్రాఫిక్ నియంత్రణకు జీఎమ్మార్ 30 మంది ఆదనపు సిబ్బందిని నియమించింది. వారు టోల్ప్లాజాతోపాటు చౌటుప్పల్ మండల పరిధిలోని దండు మైలారం, దండు మల్కాపురం, ఖైతాపురం, ధర్మోజిగూడెం, అంకిరెడ్డిగూడెం, పంతంగి, గుండ్లబావి క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఏదైనా ప్రమాదం జరిగితే రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా ప్రతి 20 కిలోమీటర్లకు ఒక క్రేన్, 30 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులకు ఏదైనా ఇబ్బంది ఉంటే 100లేదా వాట్సాప్ నంబర్ 8712662111ను సంప్రదించాలని భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్రెడ్డి సూచించారు. వాహనదారులకు ఏ సమస్య ఉన్నా 1033 నంబర్ను సంప్రదించాలని జీఎంఆర్ మేనేజర్ శ్రీధర్రెడ్డి తెలిపారు.
మాడ్గులపల్లి : సంక్రాంతి సందర్భంగా అద్దంకి- నార్కట్పల్లి రహదారిపై గల టోల్ ప్లాజా వద్ద ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామని టోల్ప్లాజా మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి ఉండాలని, లేకుంటే రద్దీ పెరుగుతుందని చెప్పారు.