నందికొండ, ఏప్రిల్ 8 : గ్రామపంచాయతీ కూడా కాని నాగార్జునసాగర్ను నందికొండ మున్సిపాలిటీగా చేయడమే కాకుండా కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నందికొండ హిల్కాలనీలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బత్తుల సత్యనారాయణ అధ్యక్షతన శనివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గత పాలకుల నిర్లక్ష్యంతో 36 ఏండ్లుగా నాగార్జునసాగర్ ఎలాంటి అభివృద్ధికి నోచలేదని, 2014లో స్వరాష్ట్రం ఏర్పడ్డాకే బీఆర్ఎస్ పాలనలో నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీగా ఏర్పడి అభివృద్ధి చెందుతుందన్నారు. 18 కోట్లతో 100 పడకల దవాఖాన, 3 కోట్లతో పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ భవనం ఏర్పాటు, 2 కోట్లతో 33/11 కేవీ సామర్థ్యం గల సబ్స్టేషన్ నిర్మాణం, 25 కోట్లతో బుద్ధవనం ప్రాజెక్ట్, 75 కోట్లతో అంతర్గత రోడ్ల నిర్మాణం, వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్, వైకుంఠథామం, ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ, లాంచీస్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.
నందికొండలో కమలా నెహ్రూ ఏరియా దవాఖానను 100 పడకల దవాఖానగా మార్చి డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గతంలో కాంగ్రెస్ పాలకులు నాగార్జునసాగర్ ప్రజలను ఓటుబ్యాంక్గానే చూశారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. నందికొండవాసుల సొంతింటి కలను బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిందని, త్వరలోనే లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నందికొండలో ఇండ్ల పట్టాలు రాని వారి సమస్యలను మంత్రి జగదీశ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
యువతకు స్థానిక కంపెనీల్లోనే కాకుండా ఇతర కంపెనీల్లోనూ ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు ఇతర ఏ రాష్ట్రంలో లేవని పేర్కొన్నారు. మన రాష్ర్టానికి రావాల్సిన 40 లక్షల కోట్ల నిధులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు. కేంద్రంపై యుద్ధం మొదలు పెట్టి బీఆర్ఎస్ పార్టీతో ముందుకు దూసుకెళ్తున్న సీఎం కేసీఆర్కు మనమంతా అండగా నిలువాల్సిన అవసరం ఉందన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, రానున్న ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను గెలిపించుకొని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు.
ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన రాష్ట్రంలోనే ట్రైకార్ చైర్మన్ రాంచందర్నాయక్
నియోజకవర్గ అభివృద్ధి బీఆర్ఎస్ పాలనతోనే ప్రారంభమైదని, కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్ అన్నారు. అన్నివర్గాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఈ పథకాలను అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు పన్నుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే అని పేర్కొన్నారు. దళిత బంధు పథకం అందరికీ అందనున్నదని, దీనిపై అపోహలు వద్దన్నారు. రానున్న రోజుల్లోనూ బీఆర్ఎస్తోనే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు.
సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్రెడ్డి, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్ గజ్జెల లింగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుంటక వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు వెంకటేశ్వర్లు, చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కర్న అనూషాశరత్రెడ్డి, వైస్ చైర్మన్ మంద రఘువీర్, రాష్ట్ర నాయకులు కర్న బ్రహ్మానందరెడ్డి, సంపత్కుమార్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు రాంబాబు, బీఆర్ఎస్కేవీ రాష్ట్ర కార్యదర్శి బషీర్, మైనార్టీ నాయకుడు అబ్బాస్, నాయకులు ప్రదీప్, ఆవులదొడ్డి రాహుల్, సత్యనారాయణరెడ్డి, గుజ్జుల కొండల్, కృష్ణ, శాంతకుమారి, చంద్రమౌళి, శ్రీను, రవినాయక్, వెంకటేశ్వర్లు, నరేందర్, హైమావతి, ఫాతిమా, శ్రీనివాస్రెడ్డి, కృష్ణమూర్తి, రాందాస్ పాల్గొన్నారు.
అభివృద్ధికి ఆకర్షితులయ్యే బీఆర్ఎస్లో చేరికలు
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నందికొండ హిల్కాలనీలోని ఆరో వార్డుకు చెందిన 20 మంది మహిళా సంఘాల నాయకులు బీఆర్ఎస్ జిల్లా నాయకుడు రాంబాబు ఆధ్వర్యంలో హిల్కాలనీలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.