నల్లగొండ, డిసెంబర్ 10 : తెలంగాణ ఆత్మగౌరవ పత్రికలుగా ప్రజాదరణ పొందిన ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దినపత్రికల ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఆటో షోను జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. మెయిన్ స్పాన్సర్ ఎస్బీఐ, కో స్పాన్సర్ పవన్ మోటార్స్, మీడియా పార్ట్నర్గా టీ న్యూస్ వ్యవహరించిన ఈ షో రెండ్రోజులపాటు జరుగనున్నది. పట్టణంలో ఇప్పటి వరకు ఇలాంటి షో ఎవరూ నిర్వహించకపోవడంతో కొనుగోలు దారుల నుంచి అనూహ్య స్పందన లభించింది.
ఉదయం 11 గంటలకు ప్రారంభమైన షో రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. రెండోరోజు ఆదివారం కూడా ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్నది. ఇదిలా ఉండగా విజిటర్లకు లక్కీ డ్రాలో కేఫ్ నిలోఫర్ సహకారంతో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి , గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే అడ్వైర్టెజ్మెంట్ జనరల్ మేనేజర్ సురేందర్రావు, ఏజీఎం రాజిరెడ్డి, నల్లగొండ బ్రాంచ్ మేనేజర్ తొవిటి మహేందర్, ఎడిషన్ ఇన్చార్జి మడూరి నరేందర్, బ్యూరో ఇన్చార్జి మర్రి మహేందర్రెడ్డి, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ మురళీకృష్ణ, రీజినల్ మేనేజర్ విజయ్కుమార్, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ వీరన్ననాయక్, కౌన్సిలర్లు ఊట్కూరి వెంకట్రెడ్డి, ఖయ్యూం బేగ్, రావుల శ్రీనివాస్రెడ్డి, నమస్తే తెలంగాణ అడ్వైర్టెజ్మెంట్ మేనేజర్ శివకుమార్, సర్క్యులేషన్ మేనేజర్ మల్సూర్గౌడ్, ప్రొడక్షన్ ఇన్చార్జి ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.
జ్యోతి ప్రజ్వలన చేసి ఆటోషోను ప్రారంభిస్తున్న జడ్పీ చైర్మన్ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లికార్జున్రెడ్డి, నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఏడీవీటీ జీఎం సురేందర్రావు, చిత్రంలో నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ తొవిటి మహేందర్, ఎడిషన్ ఇన్చార్జి మడూరి నరేందర్,బ్యూరో ఇన్చార్జి మర్రి మహేందర్రెడ్డి, ఏడీవీటీ ఇన్చార్జి శివకుమార్
ప్రత్యేక డిస్కౌంట్ అందించిన కంపెనీలు
రెండ్రోజుల ఆటో షో కార్యక్రమంలో భాగంగా శనివారం ఎన్జీ కళాశాలలో పలు కంపెనీలకు చెందిన టూ వీలర్స్, కార్లు, ట్రాక్టర్లు, వాటికి సంబంధించిన ఇంప్లిమెంట్స్ అందుబాటులో ఉంచారు. తొలి రోజు బైకులు, కార్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేసిన కొనుగోలు దారులకు కంపెనీ ప్రతినిధులు ప్రత్యేక డిస్కౌంట్ అందజేశారు. బైక్లకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు, కార్లకు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు తగ్గింపు ఇవ్వడంతోపాటు ఆయా వాహనాల్లో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించి కొనుగోలు దారులకు అందజేశారు.
19 కంపెనీల వాహనాల ప్రదర్శన
పవన్ మోటార్స్కు సంబంధించిన మారుతీ సుజుకీ, నెక్సా,సిట్రోయన్, ప్రైడ్ మోటార్స్ ప్రైడ్ హోండా, కున్ బీవైడీ, కుషాల్ హోండా, కియా, రాయల్ ఎన్ఫీల్డ్, జాన్డీర్, వెంకటరమణ హీరో, శ్రీరామ అగ్రి ఏజన్సీస్ సోలిస్ యాన్మార్, ఎజ్డీ మల్లిక్ ఆటోమేటివ్, వీఆర్ కేటీఎం, మ్యారిసన్ గ్యారేజెస్, విగ్నేశ్వర హోండా, మహావీర్ స్కోడా, వెంకటరమణ మోటార్స్, మహీంద్రా ట్రాక్టర్స్, లక్ష్మి నిస్సాన్ కంపెనీలకు సంబంధించిన వాహనాలను ప్రదర్శనలో ఉంచగా పెద్దఎత్తున కొనుగోళ్లు జరిగాయి. వేలాది మంది విజిటర్స్ ఆటో షోలో పాల్గొన్నారు. వారిలో కొంత మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి బహుమతులు అందచేశారు. అయితే వాహనాలు కొనుగోలు చేసిన వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర సహకార బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తక్కువ వడ్డీకే రుణ సౌకర్యం కల్పించి వాహనాలు అందజేశాయి.
ఆటో షోకు స్పందన బాగుంది
వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతున్న నల్లగొండలో నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటోషోకు వచ్చిన స్పందన బాగుంది. వ్యవసాయం అవసరాల కోసం పలువురు స్టాల్స్ను సందర్శించారు. ఇంత పెద్ద మొత్తంలో నల్లగొండలో ఆటోషో నిర్వహించడం ఇదే మొదటిసారి. అయినా ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్టాల్స్ను సందర్శించారు.
-మధుసూదన్రెడ్డి, టీం లీడర్, మహేంద్ర ట్రాక్టర్స్
ఎక్కువ మంది ఆసక్త్తి కనబరుస్తున్నరు
ఆటో షో కోసం గచ్చిబౌలి నుంచి ఇక్కడికి వచ్చాం. ప్రజలు పెద్ద సంఖ్యలో మా వెహికిల్స్పై ఆసక్తి కనబరిచారు. స్టాల్స్ వద్దకు వచ్చిన వారు మా కార్ల నాణ్యతా ప్రమాణాలు, మైలేజ్ అడిగి తెలుసుకున్నారు. కార్లు కొనేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మా కార్లకు మంచి ఆదరణ వచ్చింది. ఇలాంటి షోలు నిర్వహించడం సంతోషకరం.
-బిపిన్ రాజు, కున్ మోటార్స్, గచ్చిబౌలి
షోలో భాగస్వామ్యం ఆనందంగా ఉంది
నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటో షోకు జనాదరణ బాగుంది. మా కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. షోకు వచ్చిన ప్రజల్లో ఎక్కువ మంది మా కార్లను తిలకించారు. గతంలో ఇలాంటి షోలను మా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించేవాళ్లం. ఇప్పుడు నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో నల్లగొండలో నిర్వహిస్తున్న షోలో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉంది.
– యాకూబ్, సేల్స్మెన్, టాటా మోటార్స్
ఆటో మొబైల్ రంగానికి మంచి డిమాండ్
రాష్ట్రంలో ఆదాయ వనరులు వృద్ధి చెంది తలసరి ఆదాయం పెరగడంతో మార్కెట్లో ఆటో మొబైల్ రంగం దూసుకుపోతున్నది. కొనుగోలుదారులు షోరూమ్స్ వెతుక్కుని ఇబ్బంది పడకుండా ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ఆటో షో నిర్వహించడం ఆనందంగా ఉంది. ఆటో షోలో అన్ని వాహనాలు పరిశీలించాం. షోరూం కంటే ధరలు తక్కువగా ఉండడం కొనుగోలుదారులకు కలిసి వస్తుంది. రానున్న రోజుల్లోనూ ఇలాంటి ఆటో షోలు నిర్వహించాలి. ఆటోషోను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– బండ నరేందర్రెడ్డి, నల్లగొండ జడ్పీ చైర్మన్
నల్లగొండలో ఆటో షో శుభపరిణామం
‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో టీ న్యూస్ మీడియా పార్ట్నర్గా ఆటో షో ఏర్పాటు చేయడం కొనుగోలుదారులకు గొప్ప శుభపరిణామం. అన్ని రకాల వాహనాలు ఒకే దగ్గర ఉన్నందున కొనుగోలుదారులకు వ్యయ ప్రయాస తగ్గుతుంది. ప్రస్తుతం ఆటో మొబైల్ రంగం దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రతి ఇంట్లోనూ బైక్లు, కార్ల వినియోగం పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ట్రాక్టర్లు సైతం బాగా పెరిగాయి. పొల్యూషన్ సమస్య లేకుండా ఉండేందుకు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి పెరగాల్సి ఉంది.
-కంచర్ల భూపాల్రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే
ఆటోషోతో అన్ని కంపెనీల వాహనాలను ఒకే వేదికపైకి తెచ్చాం..
కాలానుగుణంగా ఆటో మొబైల్స్ రంగానికి డిమాండ్ పెరుగడంతో ప్రస్తుతం పెద్ద నగరాల నుంచి మండల కేంద్రాల వరకు ఔట్లెట్ సెంటర్లు వచ్చాయి. ప్రస్తుతం ప్రతి ఇంట్లో బైక్లు, కార్లు, సర్వ సాధారణమయ్యాయి. కొనుగోలుదారులకు ఒకే వేదికపై అన్ని వాహనాలను అందించేందుకు నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ఆటో షో నిర్వహిస్తున్నది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– సురేందర్రావు, నమస్తే తెలంగాణ అడ్వైర్టెజ్మెంట్ జీఎం
ఎస్బీఐ భాగస్వామ్యం సంతోషదాయకం
‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఆటో షో నిర్వహిస్తూ అందులో ఎస్బీఐని భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉంది. మేము వాహనాలకు తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ షోలో ఎంతమంది తీసుకున్నా వారికి రుణ సౌకర్యం కల్పిస్తాం. దిన పత్రికలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామం. రానున్న రోజుల్లోనూ మా సహకారం ఉంటుంది.
– ప్రశాంత్కుమార్ బారియర్, నల్లగొండ ఎస్బీఐ జీఎం