లక్కీ డ్రా ద్వారా బహుమతుల పంపిణీ..
ఆటోషోలో ప్రతి విజిటర్కు ఒక కూపన్ ఇచ్చి వారి పేరుతో బాక్సులో వేయించారు. వాటి ఆధారంగా రెండు సార్లు వేర్వేరుగా లక్కీడ్రా తీశారు. విజిటర్స్లో వీరయ్య, శ్రీనివాస్ అనే వ్యక్తులకు, డీలర్స్లో కియా కంపెనీ లక్కీ డ్రాలో విజేతలుగా నిలువడంతో వారికి కేఫ్ నిలోఫర్ సహకారంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి బహుమతులు అందజేశారు. అనంతరం బంపర్ డ్రా తీయగా నార్కట్పల్లికి చెందిన రాకేశ్ అనే వ్యక్తి పేరు రాగా అతనికి నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే సమకూర్చిన స్మార్ట్ఫోన్ అందజేశారు. అనంతరం ఆటోషోలో భాగస్వామ్యమైన 22 కంపెనీల ప్రతినిధులకు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో మెమెంటోలు అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ తొవిటి మహేందర్, ఎడిషన్ ఇన్చార్జి మడూరి నరేందర్, బ్యూరో ఇన్చార్జి మర్రి మహేందర్రెడ్డి, అడ్వైర్టెజ్మెంట్ మేనేజర్ కైరంకొండ శివకుమార్, సర్క్యులేషన్ మేనేజర్ మారగోని మల్సూర్గౌడ్, ప్రొడక్షన్ ఇన్చార్జి తూముల ప్రవీణ్, నమస్తే తెలంగాణ రిపోర్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
నల్లగొండ, డిసెంబర్ 11 : పురుడు పోసుకున్న ఎనిమిదేండ్లలోనే తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఎంతో ఎదుగడంతో ఆటోమొబైల్ రంగం భారీగా పుంజుకుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యంలో టీ న్యూస్ మీడియా పార్టనర్గా, ఎస్బీఐ మెయిన్ స్పాన్సర్గా, పవన్ మోటార్స్ కో స్పాన్సర్గా నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల ఆవరణలో రెండ్రోజులపాటు నిర్వహించిన ఆటోషో ఆదివారం ముగిసింది. కార్యక్రమానికి విచ్చేసిన గుత్తా మాట్లాడుతూ.. దేశంలో కెల్లా తెలంగాణ ఎన్నో ఆర్థిక వనరులు సంపాదించుకున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో అవసరాల కోసం ప్రతి వ్యక్తి టూ వీలర్, ఫోర్వీలర్ కొనుగోలు చేస్తున్నారని, వ్యవసాయం ఎక్కువగా ఉన్నవారు ట్రాక్టర్లు వాడుతున్నట్లు తెలిపారు. ఆటో మొబైల్ రంగం బాగా పుంజుకున్నందునే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా హైదారాబాద్ లాంటి నగరాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో రోడ్ల విస్తరణతోపాటు మెట్రో సర్వీసులు, ఫ్లై ఓవర్ల నిర్మాణాలపై సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో మనిషి సగటు ఆదాయం రూ.2 లక్షలకు పెరిగినందున ప్రస్తుతం ప్రతి ఇంట్లో మొబైల్స్, బైక్లు, కార్లు, ట్రాక్టర్లు ఉన్నాయన్నారు. వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందిన నేపథ్యంలోనే ఈ ఆదాయ వనరులు పెరిగినట్లు తెలిపారు. అయితే నేడు వాహనాలు కొనుగోలు చేద్దామన్నా కొందరికి వాటిపై అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారని, అలాంటి వారి కోసం వాహనాలపై అవగాహన కల్పించేందుకు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఆటో షో నిర్వహించడం అభినందనీయమన్నారు
స్టాల్స్ను సందర్శించిన సుఖేందర్రెడ్డి
ఆటో షోలో ఏర్పాటు చేసిన పలు కంపెనీల స్టాల్స్ను మండలి చైర్మన్ గుత్తా సందర్శించారు. బైక్లు, కార్లు, ట్రాక్టర్లను పరిశీలించి వాటి ఫీచర్లను అడిగి తెలుసుకున్నారు. ఏది ఎంత సీసీ.. ఎంత మైలేజీ ఇస్తుంది.. ధర ఎంత.. అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ గురించి ప్రత్యేకంగా అడిగి శ్రీరామ అగ్రి ఏజన్సీస్లో రూ.300 పెట్టి డ్రమ్ స్ప్రేయర్ కొనుగోలు చేశారు.
19 కంపెనీల వాహనాల ప్రదర్శన
ఆటో షోలో 19 కంపెనీలకు సంబంధించిన వాహనాలు ప్రదర్శనలో ఉంచగా మూడు బ్యాంకులు రుణ సౌకర్యం కల్పించాయి. పవన్ మోటార్స్కు చెందిన మారుతీ సుజుకీ, నెక్సా, సిట్రోయన్, ప్రైడ్ మోటార్స్ ప్రైడ్ హోండా, కున్ బీవైడీ, కుషాల్ హోండా, కియా, రాయల్ ఎన్ఫీల్డ్, జాన్డీర్, వెంకటరమణ హీరో, శ్రీరామ అగ్రి ఏజన్సీస్ సోలిస్ యాన్మార్, ఎజ్డీ మల్లిక్ ఆటోమేటివ్, వీఆర్ కేటీఎం, మ్యారీ గ్యారేజెస్, శ్రీ విఘ్నేశ్వర హోండా, మహావీర్ స్కోడా, వెంకటరమణ మోటార్స్, మహింద్రా ట్రాక్టర్స్, లక్ష్మి నిస్సాన్కు చెందిన వాహనాలను ప్రదర్శనలో పెట్టగా పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిగాయి.
సుమారు వెయ్యి మందికి పైగా విజిటర్స్ ఆటో షోలో పాల్గొనగా వారిలో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన వారికకి బహుమతులు అందజేశారు. వాహనాలు కొనుగోలు చేసిన వారికి స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర సహకార బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా రుణ సౌకర్యం కల్పించి వాహనాలు అందజేశాయి.