నీలగిరిలో రూ.912 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభంతోపాటు వివిధ పనులకు మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంతి కేటీఆర్ సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్లగొండ ఎంతో అభివృద్ధి చెందినదన్నారు.
రామగిరి, అక్టోబర్ 2 : రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండలో రూ.90 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభోత్సవ వేడుక సోమవారం అట్టహాసంగా జరిగింది. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి ఐటీ, మున్సిపాల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రిబ్బన్ కట్చేసి ప్రారంభించారు. ఐటీ టవర్ లోపల పూజలు చేసి అక్కడే ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రౌండ్ఫ్లోర్లోని కేబీకే గ్రూప్స్ ఐటీ కంపెనీ సెల్ను ఆయన ప్రారంభించారు. కంపెనీకి ఎంపికైన ఉద్యోగులతోపాటు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఉద్యోగానికి ఎంపికవడంతో ఎలా ఫీలవుతున్నారు? అనే అంశాలతోపాటు వారి పేర్లు అడిగి తెలుసుకున్నారు.
రూ.249 కోట్ల అభివృద్ధి పనులు..
నీలగిరి : నల్లగొండ పట్టణంలో రూ.249 కోట్లతో పూర్తి చేసిన పనుల ప్రారంభోత్సవంతోపాటు మరో రూ.663 కోట్లతో చేపట్టిన వివిధ రకాల పనులకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి శ్రీకారం చుట్టారు. మర్రిగూడ బైపాస్లో రూ.45 కోట్లతో నిర్మాణం చేపట్టిన ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేసి అక్కడే రూ.146 కోట్లతో నిర్మించిన రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ప్రారంభించారు. అక్కడి నుంచి ఐటీ హబ్కు చేరుకొని రూ.90 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ను ప్రారంభించారు. అనంతరం పాలకేంద్రం వద్ద తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు.
ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో పాల్గొని తిరిగి అక్కడే రూ.36 కోట్లతో చేపట్టే ఎన్జీ కళాశాల ఆధునీకరణ పనులను ప్రారంభించి క్లాక్టవర్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ బటన్ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేసిన కళాభారతి ఆడిటోరియం(రూ.90.61కోట్లు), ఉదయ సముద్రం సుందరీకరణ(రూ.139.21 కోట్లు), అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు(రూ.55 కోట్లు), మిషన్ భగీరథ నిధులతో అమృత్2.0 (రూ.56.75), యూజీడీ నిర్మాణానికి(రూ.216.19 కోట్లు), ఆర్అండ్బీ అతిథి గృహం(రూ.6.25 కోట్లు), ఆర్అండ్బీ డివిజన్ ఆఫీస్(రూ.6 కోట్లు)కు శంకుస్ధాపన, 90 లక్షలతో నిర్మించిన సుభాశ్ చంద్రబోస్, అంబేద్కర్ జంక్షన్లు, రూ.1.66 కోట్లతో నిర్మించిన షల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్, రూ.1.11 కోట్లతో చేపట్టిన రైతుబజార్ను ప్రారంభించారు. అక్కడి నుంచి కలెక్టర్ బంగ్లాకు ఎదురుగా ఏర్పాటు చేసిన ఓబీసీ పితామహుడు బీపీ మండల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి వెనుదిరిగి కోటి రూపాయలతో చేపట్టిన ఎన్జీ కళాశాల వద్ద వీధి వ్యాపారుల దుకాణ సముదాయం, రూ.8.05 కోట్లతో చేపట్టిన బీట్ మార్కెట్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ప్రారంభించారు.
చేనేత కళాకారుల మొబైల్ యాప్ ఆవిష్కరణ
నల్లగొండ రూరల్, అక్టోబర్ 2 : జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ నల్లగొండలోని మదర్ డెయిరీ పాలకేంద్రం ఆవరణంలో చేనేత, జౌళి శాఖ ఏర్పాటు చేసిన చేనేత కళాకారుల మొబైల్ యాప్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అలాగే తేరట్పల్లి, గట్టుప్పల్కు చెందిన వారికి ఆధునిక ప్రేమ్ మగ్గాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మొబైల్ యాప్తో ప్రభుత్వం చేనేత కార్మికులకు సహాయ, సహకారాలు అందించడంతోపాటు వారి అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులకు ఈ మొబైల్ యాప్లో సంపూర్ణ సమాచారం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఏమి కావాలన్నా అందులో అపులోడ్ చేయవచ్చని చెప్పారు. ఈ యాప్తో దళారుల బెడద ఉండదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల గుంట మగ్గాల స్థానంలో ఆధునిక ప్రేమ్ మగ్గాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే గట్టుప్పల్ క్లస్టర్లో 2.50 కోట్లతో, తేరట్పల్లిలో 10 లక్షలతో ఆధునిక ప్రేమ్ మగ్గాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, చేనేత జౌళి శాఖ రాష్ట్ర డైరెక్టర్ వర్షిణి, రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎం.వెంకటేశం, అడిషనల్ డైరెక్టర్ పి.వెంకటేశం, ఏడీ ద్వారక్, యాదాద్రి ఏడీ విద్యాసాగర్, కర్నాటి వెంకటేశం, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ అభివృద్ధి పనులు ప్రారంభం
మిర్యాలగూడ, అక్టోబర్ 2 : మిర్యాలగూడ పట్టణంలో రూ.311కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిర్యాలగూడ నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్ను రూ.30వేల కోట్లతో నిర్మిస్తున్నామని, ఇది త్వరలోనే పూర్తి కానుందన్నారు. మిర్యాలగూడ నియోజవకర్గ వ్యాప్తంగా రూ.7,600కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. గతంలో ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు చేపట్టినట్లు తెలిపారు. మున్ముందు మరింత అభివృద్ధి కోసం వచ్చే ఎన్నికల్లో భాస్కర్రావును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
కేటీఆర్ సార్తో మాట్లాడం సంతోషంగా ఉంది
మాది సూర్యాపేట. నేను ఎంసీఏ, బీఈడీ పూర్తి చేశాను. కాగా, ఇటీవల నల్లగొండలోని ఐటీ టవర్లో ఉద్యోగాల కోసం నిర్వహించిన ఉద్యోగాల ఎంపికకు రావడంతో కేబీకే కంపెనీకి ఎంపికయ్యాను. ఐటీ టవర్ ప్రారంభోత్సం సందర్భంగా మంత్రి కేటీఆర్ సార్ పలుకరించి నాపేరు, ఊరు అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగ భరోసా కల్పించేలా ధైర్యం చెప్పారు. కేటీఆర్ను చూడగలనా అనుకున్నా కానీ, ఆయనతో స్వయంగా మాట్లాడే అవకాశం రావడంతో సంతోషంగా ఉంది. స్థానికంగా ఐటీ ఉద్యోగాలు కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డికి ధన్యవాదాలు.
– భూపతి కవిత, కేబికే కంపెనీకి ఎంపికైన ఉద్యోగి, నల్లగొండ
28 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం
నల్లగొండ ఐటీ టవర్లో కేబీకే బిజినెస్ సొల్యూషన్స్లో 28 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. మా కంపెనీ సీఈఓ భరత్కుమార్ నల్లగొండ వాసినే. తన సొంత జిల్లాలో మళ్లీ జాబ్మేళా నిర్వహించి ఇంకా ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. ఈ అవకాశాన్ని యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఐటీ టవర్లో మంత్రి కేటీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మా కంపెనీ ప్రారంభించి ఉద్యోగులతో ముఖాముఖి చర్చ చేసి మాట్లాడటంతోపాటు నాకు నియామక పత్రం అందజేయడం సంతోషంగా ఉంది.
– అరుణ్కుమార్ జెక్కి, హెచ్ఆర్ మేనేజర్, కేబీకే సొల్యూషన్స్
టాస్క్తో యువతకు ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తూ టాస్క్తో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం. తొలి విడుతలో నల్లగొండ ఐటీ టవర్లో 170 మంది ఉద్యోగులుగా చేరారు. మరో విడుతలో 150 మందికి అవకాశం కల్పిస్తాం. ప్రస్తుతానికి 16 కంపెనీలు వచ్చాయి. అదేవిధంగా మరో మూడు సిద్ధంగా ఉండగా, ఇంకా నూతన కంపెనీలు సైతం వస్తాయి. ఐటీ రంగంలో యువతకు కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ స్కిల్స్తోపాటు ఉద్యోగావకాశాలకు అవసరమైన శిక్షణ అందిస్తాం. అందరు సద్వినియోగం చేసుకోవాలి.
-శ్రీకాంత్ సిన్హా, సీఈఓ, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్)
ఐటీ టవర్లో ఉద్యోగం రావడం అదృష్టంగా భావిస్తున్నా
నేను డిగ్రీతోపాటు నల్లగొండలోని డీవీఎం కళాశాలలో బీఈడీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు రాశాను. నల్లగొండలోని ఐటీ టవర్లో ఉద్యోగాలకు జాబ్మెళా నిర్వహించగా నేను హాజరై కేబీకే సొల్యూషన్స్ వారు నిర్వహించిన రాత పరీక్ష, ఇంటర్యూలో ప్రతిభ కనబర్చాను. దాంతో నాకు ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగంతో మా కుటుంబ సభ్యులంతా సంతోషం వ్యక్తం చేశారు. చదువు పూర్తి చేస్తుండగానే సొంత ఊరిలో ఐటీ ఉద్యోగం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఐటీ టవర్ ప్రారంభోత్సావానికి వచ్చిన మంత్రి కేటీఆర్ సార్ మా కంపెనీకి ఎంపికైన ప్రతి ఉద్యోగి పేరు తెలుసుకోవడంతోపాటు మాతో సెల్ఫీ దిగడం ఆనందంగా ఉంది. ఉద్యోగావకాశాలు కల్పించిన ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి కృతజ్ఞతలు.
– యాస్మిన్ కౌసర్, ఐటీ ఉద్యోగిని
నల్లగొండవాసిగా ఐటీ టవర్లో కంపెనీ ప్రారంభించా
నేను నల్లగొండ ప్రాంత వాసినే. మా నాన్న కోణం శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అయితే నేను అమెరికా వెళ్లడంతోపాటు అక్కడే కోణం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సొంత ఐటీ కంపెనీ ప్రారంభించి వందల మందికి ఉద్యోగాలు కల్పించా. అమెరికాతోపాటు చెన్నై, బెంగళూర్లో మా కంపెనీ సేవలు అందిస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం ఐటీ టవర్స్ నిర్మాణం చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తుండటంతో నా సొంత ఊర్లో యువతకు ఉద్యోగాలివ్వాలని ఐటీ కంపెనీ ప్రారంభించా. భవిష్యత్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా టాస్క్ సీఈఓతో ఒప్పందాన్ని(ఎంఓయూ)ను మంత్రి కేటీఆర్ సమక్షంలో చేశాను. అర్హులంతా మేము చేపట్టే ఉద్యోగాల ఎంపికను సద్వినియోగం చేసుకోవాలి.
– కోణం సందీప్, కోణం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, నల్లగొండ