అమెరికాలో నల్లగొండ యువకుడి దారుణ హత్య
తండ్రితో శుక్రవారం చివరగా మాట్లాడిన సాయిచరణ్
ఎంఎస్ కోసం వెళ్లి అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం
రివాల్వర్తో కాల్చి చంపిన దుండగులు
ఫ్రెండ్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వస్తుండగా దారుణం!
తల్లిదండ్రులకు తీరని శోకం బాధిత కుటుంబాన్ని ఓదార్చిన
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి
‘నాన్న.. మీ ఆరోగ్యం జాగ్రత్త!’ అని పాతికేండ్ల కొడుకు తండ్రికి చెప్పిన ఆ మాటలే చివరి మాటలయ్యాయి. ‘నవంబర్లో ఇంటికి వస్తా డాడీ, కొద్దిరోజులు మీతో, అమ్మతో హ్యాపీగా గడుపుతాను!!’ అని చెప్పినవాడు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఒంటరి వాళ్లను చేసి వెళ్లిపోయాడు. ఇప్పుడే కాదు, ‘ఒక్కగానొక్క కొడుకువి యూఎస్ దాకా ఎందుకు’ అని వారించినా వినిపించుకోలేదు. విదేశాల్లో ఎంఎస్ చేసి, ఉన్నతంగా స్థిరపడాలనుకున్నాడు. అదే లక్ష్యంతో రెండేండ్ల కింద అమెరికాలో అడుగు పెట్టాడు. ఎంఎస్ పూర్తి చేసిన వెంటనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. ఈ మధ్యే కారు కూడా కొన్నాడు. నాలుగు నెలల్లో ఇండియా రావాల్సి ఉండగా, బాల్టిమోర్లో దుండగుల కాల్పుల్లో మృత్యువాత పడి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చాడు.
నల్లగొండ వివేకానందనగర్కు చెందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ నక్కా నర్సింహ కుమారుడు సాయిచరణ్(25) అమెరికాలోని బాల్టిమోర్లో నల్లజాతీయుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4.30గంటలకు తన స్నేహితుడిని విమానాశ్రయంలో డ్రాప్ చేసి వస్తుండగా, ఈ ఘోరం జరిగింది. సాయిచరణ్ను అటకాయించిన దుండగులు కారు అద్దం నుంచి రివాల్వర్తో కాల్చి చంపారు. అమెరికాలోనే స్థిరపడిన సాయిచరణ్ సోదరి హారిక స్థానిక న్యూస్ చానళ్లలో ప్రసారమైన తమ్ముడి మరణ వార్త చూసి కుటుంబసభ్యులకు చెప్పింది. సాయిచరణ్ మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే భూపాల్రెడ్డి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సాయిచరణ్ మృతదేహాన్ని త్వరగా తీసుకొస్తామని హామీనిచ్చారు. కాగా, సాయిచరణ్కు తప్ప అతని స్నేహితుల్లో ఎవరికీ కారు లేదు. అందువల్లే సాయిచంద్ తన స్నేహితుడిని డ్రాప్ చేసేందుకు వెళ్లి ఉండొచ్చని, అదే అతడి ప్రాణం తీసినట్టయిందని బాధిత కుటుంబ సభ్యులు కంటతడితో చెప్పుకొచ్చారు.
నీలగిరి, జూన్ 22 : ఎన్నో కలలు కన్నాడు.. వాటిని చేరుకోవాలని చిన్నతనం నుంచే కష్టపడి చదివాడు… విదేశాలకు వెళ్లి చదువును పూర్తి చేసి ఉద్యోగం సంపాదించాడు.. ఆశయాలను సాధిస్తూ ముందుకు పోతున్న యువకుడిపై దుండగలు దారుణానికి ఒడికట్టారు.. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న నల్లగొండ యువకుడు నక్కా సాయిచరణ్(25)ను అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం బాల్టిమోర్లో దారుణంగా కాల్చి చంపారు. అదివారం ఉదయం తన స్నేహితులను విమానాశ్రయంలో వదిలి కారులో ఇంటికి వస్తుండగా నల్లజాతీయులు సాయిచరణ్ను అటకాయించే ప్రయత్నం చేశారు. అతడు ప్రతిఘటించే సమయంలో దుండగులు జరిపిన కాల్పుల్లో కారు అద్దాల నుంచి వచ్చిన బుల్లెట్ సాయిచరణ్ తలలోకి దూసుకెళ్లడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. లోకల్ చానల్లో ప్రసారం కావడంతో అక్కడే స్థిరపడిన మృతుడి అక్క హారిక చూసి వివరాలు తెలుసుకున్నది. తన తమ్ముడేనని నిర్ధారణ చేసుకుని బాబాయ్ అమర్నాథ్కు సమాచారం ఇచ్చింది. సోమవారం సాయంత్రం ఆయన బాబాయ్ రాత్రి పది గంటల సమయంలో కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో కాల్పులు ఎందుకు జరిపారో తెలియడం లేదు. ఉదయం తమ కుమారుడు మాత్రం వాకింగ్కు వెళ్లుండేవాడని తండ్రి చెబుతున్నాడు. ఈక్రమంలో కూడా హత్య జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.
ఆశయమే లక్ష్యంగా ఎదిగిన సాయిచరణ్
గుర్రంపోడు మండలం చామలోనిబావి గ్రామానికి చెందిన నక్కా నర్సింహ,పద్మ దంపతులకు ప్రథమ సంతానంగా హరిక, ఎనమిదేళ్ల తరువాత సాయిచరణ్ జన్మించారు. గుర్రంపోడులో స్థిరపడిన నర్సింహ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొందడంతో సుమారు పదేండ్ల క్రితం నల్లగొండకు వచ్చి వివేకానందనగర్లో స్థిరపడ్డాడు. పిల్లలను చదివిస్తూ అమ్మాయికి విదేశీసంబంధం రావడంతో పెండ్లి చేశాడు. తర్వాత కుమారుడిని పదో తరగతి వరకు నల్లగొండలో ఇంటర్, బీటెక్ హైదరాబాద్లో చదివించారు. నాలుగేండ్ల క్రితం పదవీ విరమణ పొందాడు. నాన్న ఆశయాలకు అనుగుణంగా ఎదిగిన సాయిచరణ్ అంతకన్నా ఉన్నతంగా ఎదుగాలని చిన్నతనం నుండే కలలు కన్నాడు. అక్కబావ విదేశాల్లో ఉండడంతో 2020 ఆగస్టులో ఎంఎస్ కోసం మేరీలాండ్ రాష్ట్రంలోని బాల్టీమోర్కు వెళ్లాడు. సిన్సినాటీ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసి జనవరి 2022 సంవత్సరంలో అక్కడే ఓ కంపెనీలో సాప్ట్వేర్ ఉద్యోగం సంపాదించాడు. కొద్దిరోజుల క్రితమే కారు కొనుగోలు చేశాడు. తన కలలను సాకారం చేసుకుంటున్న క్రమంలో నల్లజాతీయులు దారుణానికి పాల్పడ్డారు.
సాయిచరణ్ చివరి మాటలు.. అవే
ఉన్నత చదువుల నిమిత్తం అక్క హారిక అమెరికాలో స్థిరపడటంతో అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు సాయిచరణ్. కరోనా కారణంగా కొంత ఆలస్యంగా ఆగస్టు 2020లో వెళ్లాడు. తల్లిదండ్రులతో ఫోన్లోమాట్లాడేవాడు. శుక్రవారం సాయంత్రం తండ్రి నర్సింహకు ఫోన్ చేసి బ్యాంకు వివరాలు పంపాలని కోరాడు. తండ్రి ఇంటికి రావాల్సిందిగా కోరడంతో నవంబర్లో వస్తానని దిగులు పడవద్దని.. ఆరోగ్యం జాగ్రత్త అని హితవు చెప్పాడు. కొడుకు చెప్పిన ప్రకారంగా శనివారం బ్యాంకు డీటైయిల్స్ పంపాడు…
విషాదంలో కుటుంబసభ్యులు
ఉన్నత చదువును పూర్తిచేసి సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తూ జీవితంలో స్థిరపడుతున్న సాయిచరణ్ నల్లజాతీయుల కాల్పుల్లో చనిపోయాడని తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ కుమారుడు ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేక వృద్ధ దంపతులు కన్నీటిపర్యంతం అయ్యారు. ఒక్కగానొక్క కుమారుడు తమకు దూరమయ్యాడని రోదించిన తీరు అక్కడున్న ప్రతిఒక్కరినీ కంటనీరు పెట్టించింది.
సాయిచరణ్ కుటుంబానికి అండగా ఉంటాం : ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి
అమెరికాలో నల్లజాతీయుల కాల్పుల్లో నల్లగొండ పట్టణ వాసి చనిపోయాడని తెలియడంతో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి స్థానిక మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి మృతుడి ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. తలిదండ్రులను ఓదార్చారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావుతో ఫోన్లో మాట్లాడి ప్రభుత్వం తరుపున సాయిచరణ్ మృతదేహన్ని త్వరగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
నా కొడుకు మృతదేహాన్ని తెప్పించండి : సాయిచరణ్ తండ్రి నర్సింహ
అమెరికాలో చనిపోయిన తన కుమారుడు సాయిచరణ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇప్పించేలా ఏర్పాట్లు చేయాలని మృతుడి తండ్రి నక్కా నర్సింహ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అదివారం ఉదయం చనిపోయాడని సోమవారం రాత్రి తెలిసింది. మూడు రోజులగా నా కొడుకు మృతదేహం కోసం ఎదురుచూస్తున్నామని తండ్రి మీడియాతో మాట్లాడుతూ కన్నీంటి పర్యంతమయ్యాడు.