నీలగిరి, ఏప్రిల్ 14 : లోక్సభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు రూ.9.17 కోట్లు సీజ్ చేశామని ఎస్పీ చందనాదీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దులైన వాడపల్లి, అడవిదేవులపల్లి టెయిల్పాండ్, నాగార్జున సాగర్ వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ రవాణా అడ్డుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రా అధికారుల సమన్వయంతో అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులకు అనుబంధంగా ఎన్హెచ్ 65పై కేతేపల్లి టోల్ప్లాజా వద్ద,
చిట్యాల పోలీసు స్టేషన్ పరిధిలో వట్టిమర్తి, మాల్, డిండి పోలీసు స్టేషన్ పరిధిలో అంతర్ జిల్లా సరిహద్దు చెక్పోస్టులు ఏర్పాటు చేసి పారామిలటరీ సిబ్బంది, ఇతర శాఖల అధికారులతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2.70కోట్ల నగదు, 23.10లక్షల విలువైన మద్యం, 22వేల విలువ గల గంజాయి, 5.73కోట్ల విలువ గల ఆభరణాలు, 51.62లక్షల విలువగల ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,17,94,000 సీజ్ చేసినట్లు వివరించారు.
రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్ అఫిడవిట్ను సమర్పించే సమయంలో అవినీతి కార్యకలాపాలకు పాల్పడితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ చందనాదీప్తి హెచ్చరించారు. ఒక అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయడానికి, నిలబడకుండా మానేయడానికి, తన అభ్యర్థిత్వం ఉపసంహరించుకోవడానికి లేదా ఉపసంహరించుకోకుండా కొనసాగడానికి, అభ్యర్థిగా తొలగడానికి ఏదైనా కానుక ఇవ్వడం, కానుక పొందడం, నామినేషన్ ఉపసంహరణకు, ఉపసంహరణ మానివేయడానికి చేసే అవినీతి కార్యకలాపాలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం IPC సెక్షన్ 188 171B r/w 171E 120(B)ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 123(1) మరియు ఇతర చట్టాల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.