నల్లగొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి
పనులను నాణ్యతగా చేపట్టాలి
వల్లభరావు చెర్వు చుట్టూ
ట్యాంకు బండ్ను నెక్లెస్ రోడ్డులా తీర్చిదిద్దాలి
ఆహ్లాదకరంగా, అబ్బుపర్చేలా పార్కులను అభివృద్ధి చేయాలి
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పనుల పరిశీలన
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి నల్లగొండ పట్టణాన్ని అబ్బురపడేలా అభివృద్ధి చేస్తున్నారని, పనులను నాణ్యతగా, పారదర్శకంగా చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి పట్టణ అభివృద్ధి పనులను పరిశీలించారు. వల్లభరావు చెరువు చుట్టూ ట్యాంక్ బండ్ను జలవిహార్, నెక్లెస్రోడ్లాగా అద్భుతంగా తీర్చిదిద్డాలని, పాలిటెక్నిక్ కళాశాలలో నిర్మిస్తున్న ఐటీ హబ్ నుంచి ఉదయ సముద్రం వరకు కెనాల్ పక్క నుంచి రోడ్డు వేయాలని సూచించారు. పట్టణంలో జంక్షన్లు, పార్కులు ఇతర పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
నీలగిరి, మే 17 : నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రత్యేకంగా దృష్టి సారించారని, పనులను పారదర్శకంగా, నాణ్యతగా చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి పట్టణ అభివృద్ధి పనులను పరిశీలించారు. వల్లభరావు చెరువు చుట్టూ ట్యాంక్బండ్ను హైదరాబాద్లోని జలవిహార్, నెక్లెస్ రోడ్లాగా అద్భుతంగా తీర్చిదిద్దాలని సూచించారు.
సందర్శకులు విహరించడానికి హౌస్ బోట్స్, పార్కులను, సీటింగ్ బెంచీలను ఏర్పాటు చేయాలన్నారు. చెరువుకు ఇరువైపులా రోడ్లను ఏర్పాటు చేయాలన్నారు. పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్మిస్తున్న ఐటీ హబ్ నుంచి ఉదయసముద్రం వరకు ఏఎమ్మార్పీ కాల్వ పక్క నుంచి రోడ్డు వేయాలని సూచించారు. ఉదయ సముద్రం ట్యాంకుబండ్ పనుల కోసం సర్వే చేసిన ఎంట్రీ పాయింట్స్, పార్క్, చిల్డ్రన్స్ ప్లేయింగ్ మెటీరియల్, పార్కింగ్ ప్లాన్ గురించి కలెక్టర్ మంత్రికి వివరించారు. ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నామని తెలిపారు. క్లాక్టవర్ విస్తరణ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, విద్యుత్ టవర్ల నిర్మాణం ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, మున్సిపల్ కమిషనర్ డా.కేవీ రమణాచారి, కౌన్సిలర్లు వట్టిపల్లి శ్రీను, మున్సిపల్ కమిషనర్ సీసీ మహ్మద్ రఫీ పాల్గొన్నారు.