నల్లగొండ సిటీ, అక్టోబర్ 11 : టీఎస్ ఆర్టీసీ బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు ధమాకా ప్రకటించింది. పండుగ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి గిఫ్ట్ కూపన్ అందించనుంది. లక్కీ డ్రా ద్వారా మహిళలు, పురుషులకు వేర్వేరుగా ప్రత్యేక బహుమతులు అందించనుంది. ఈ నెల 21నుంచి 23వ తేదీ వరకు, 28నుంచి 30వ తేదీ వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఇది వర్తిస్తుంది.
ప్రయాణికులు తమ టిక్కెట్ వెనుక పేరు, చిరునామా, సెల్ నెంబర్ రాసి బస్టాండ్లో ఏర్పాటు చేసిన లక్కీ బాక్స్లో వేయాలి. వీటి కోసం ప్రతి బస్టాండ్లో లక్కీ బాక్స్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక సిబ్బందిని సైతం నియమించారు. అయితే.. ఈ సారి మహిళలు, పురుషులకు వేర్వేరుగా డ్రా తీయనున్నారు. ప్రతి రీజియన్లో ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషుల చొప్పున డ్రా పద్ధతిలో ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నారు. నల్లగొండ రీజియన్ పరిధిలో 7 డిపోల నుంచి 10 మందిని ఎంపిక చేసి దసరా పండుగ ముగిసిన తర్వాత హైదరాబాద్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో సంస్థ ఉన్నతాధికారులు బహుమతులను అందజేస్తారు. ఒక్కో బహుమతి విలువ రూ.9900 ఉంటుందని ఆర్టీసీ రీజియన్ మేనేజర్ శ్రీదేవి తెలిపారు. ముందస్తు టిక్కెట్ బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు కూడా ఈ స్కీమ్లో
పాల్గొనవచ్చని చెప్పారు.