జూన్ 3 నుంచి 18 వరకు పల్లె, పట్టణ ప్రగతి
పారిశుధ్యం, పచ్చదనమే ప్రధాన ఎజెండా
ఈసారి క్రీడా ప్రాంగణాలపై ప్రత్యేక దృష్టి
ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో రూ.660 కోట్లు ఖర్చు
సూర్యాపేట జిల్లాలో రూ.369 కోట్లు
హరితహారానికి నర్సరీల్లో మొక్కలు సిద్ధం
ఆదర్శ పల్లెలు, పట్టణాలే లక్ష్యంగా ప్రణాళికలు
పల్లెలకు పచ్చందాలను అద్దడమేగాక క్లీన్ అండ్ గ్రీన్గా బస్తీలను ముస్తాబు చేసిన పల్లె, పట్టణ ప్రగతి కార్యమ్రాలకు మరోమారు సమయం వచ్చింది. వచ్చే నెల 3 నుంచి 18 వరకు ఐదో విడుత పల్లె, పట్టణ ప్రగతి నిర్వహించాలన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. బుధవారం ప్రగతి భవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఒక్కో జిల్లాకు ప్రత్యేక నిధులు కూడా
కేటాయించారు. ఈసారి కార్యాచరణలో ప్రధానంగా పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. సర్కారు కృషితో ఇప్పటికే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఫలితాలు క్షేత్రస్థాయిలో అద్భుతంగా కనిపిస్తునాయి. గత మూడేండ్లలో నల్లగొండ జిల్లాకు రూ.660కోట్లు, సూర్యాపేట జిల్లాకు రూ.369 కోట్లు వెచ్చించడంతో గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠథామాలు, ట్రాక్టర్ ట్రాలీ, ట్యాంకర్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. జనాభాకు అనుగుణంగా నెలనెలా నల్లగొండ జిల్లాకు రూ.18 కోట్లు, సూర్యాపేటకు రూ.12 కోట్ల్లు విడుదల చేస్తుండడంతో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోతున్నాయి. ఈసారి గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుపైనా ప్రత్యేకంగా దృష్టి సారించనుండడం విశేషం.
నల్లగొండ ప్రతినిధి, మే 18 (నమస్తే తెలంగాణ) : ఐదో విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే నాలుగు విడుతలుగా నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు ప్రగతిబాటలో పయనిస్తున్నాయి. ప్రతి నెలా నిధులు విడుదల చేస్తుండడంతో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణతో పాటు తాగునీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణ, మొక్కల పెంపకంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ నిధులతో ఇప్పటికే ప్రతి గ్రామానికీ ఒక ట్రాక్టర్, ట్యాంకర్ సైతం కొనుగోలు చేశారు. చెత్త సేకరణతో పాటు, మొక్కలకు నీళ్లు పెట్టేందుకు ట్రాక్టర్ను వాడుకుంటున్నారు.
నల్లగొండ జిల్లాలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు ఉండగా అన్ని గ్రామాలకు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను ప్రభుత్వం సమకూర్చింది. ప్రతి నెలా 15వ ఆర్థిక సంఘంతో పాటు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను రూ.18కోట్లు విడుదల చేస్తున్నారు. జనాభా ప్రతిపాదికన ఒక్కో వ్యక్తికి ప్రతి నెలా రూ.136 చొప్పున ఏడాదికి రూ.1,632 వెచ్చిస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు నల్లగొండ జిల్లాకు రూ.535.58కోట్లు, సూర్యాపేట జిల్లాకు రూ.355.98కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాకు రూ.254.75 కోట్లను గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేశారు. ఇవి కాకుండా మండల పరిషత్తులకు 10శాతం, జిల్లా పరిషత్తులకు 5శాతం చొప్పున మరో రూ.100కోట్ల వరకు వచ్చినట్లు అంచనా.
2019లో సర్పంచ్, ఎంపీటీసీల ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గ్రామాల్లో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపట్టారు. ఒక్కో గ్రామానికి ఒక్కో కార్యదర్శి ఉండేలా చర్యలు చేపట్టారు. వీరితో పాటు ప్రతి పంచాయతీలో సిబ్బందిని పెంచుతూ అవసరాన్ని బట్టి మల్టీ పర్పస్ వర్కర్లను కొత్తగా తీసుకున్నారు. అదే ఏడాది సెప్టెంబర్ నుంచి పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టారు. 2019 సెప్టెంబర్ 6నుంచి అక్టోబర్ 5వరకు మొదటి విడుతలో నెల రోజుల పాటు పల్లె ప్రగతి నిర్వహించారు. అప్పటి నుంచే నిధుల విడుదల కూడా మొదలైంది. రెండో విడుత 2020 జనవరి 2 నుంచి 11వ వరకు పది రోజుల పాటు నిర్వహించారు. ఇదే సమయంలో పట్టణ ప్రగతిపైనా సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. 2020 జనవరిలో మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగానే ఫిబ్రవరిలో నూతన పాలకవర్గాల నేతృత్వంలో మరోసారి శ్రీకారం చుట్టారు. 2020 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6వరకు పట్టణ ప్రగతిని చేపడుతూ పారిశుధ్య నిర్వహణతో పాటు వార్డుల్లో విస్తృతంగా మొక్కలు నాటించారు. ఆ తర్వాత కరోనా పరిస్థితుల్లో గతేడాది జూన్ 1 నుంచి 8వరకు పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించారు. నాలుగో విడుతగా గతేడాది జూలై 1 నుంచి 10వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకంలో జాతీయ స్థాయిలో టాప్ టెన్లో నల్లగొండ మండలం బుద్ధారం గ్రామం, టాప్ 20లో ఆమనగల్లు గ్రామ పంచాయతీ స్థానం దక్కించుకున్నాయి.
గ్రామీణ క్రీడా ప్రాంగణాలపై దృష్టి
ఐదో విడుత పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా గత కార్యకలాపాలతో పాటు గ్రామీణ క్రీడా ప్రాంగణాలపై దృష్టి సారించనున్నారు. యువత, క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా వీటిని అందుబాటులోకి తేవాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించనున్నారు. ఉపాధి హామీ నిధులతో చదును చేసి ఆటలకు అనువుగా తీర్చిదిద్దనున్నారు. దీంతో పాటు సుమారు రూ.50వేల వరకు వెచ్చించి క్రీడా పరికరాలను సమకూర్చనున్నట్లు తెలిసింది. గ్రామంలోని 50మంది క్రీడాకారులకు ప్రత్యేకంగా టీ షర్టులు కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. గ్రామంలో ప్రత్యేకంగా క్రీడా కమిటీ ఏర్పాటు చేసి వీటిని పర్యవేక్షించేలా చూడాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తున్నది. ఐదో విడుత కార్యక్రమానికి సంబంధిత విభాగాలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని సమీక్షించనున్నారు. జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయనున్నారు.
రూ.660 కోట్లతో శాశ్వత వనరులు
ఇప్పటివరకు పల్లె ప్రగతిలో భాగంగా రూ.660కోట్లతో గ్రామాల్లో శాశ్వత వనరులను అభివృద్ధి చేశారు. ప్రతి పల్లె పచ్చదనంతో పాటు పరిశుభ్రతతో కళకళలాడాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. ఆ మేరకు అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 844 గ్రామాల పంచాయతీలకు గానూ అన్నింటికీ ట్రాక్టర్, ట్రాలీలను, ట్యాంకర్లను సమకూర్చారు. ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీళ్లు పోయడం ద్వారా ఉపాధి హామీ పథకం నుంచి గ్రామాలకు అదనపు ఆదాయం సమకూరుతున్నది. చందంపేట మండలం కోరుట్లసెంటర్ జీపీ రూ.16.81లక్షల ఆదాయంతో రాష్ట్రంలోనే ఐదో స్థానంలో నిలువడం విశేషం. ఇక 1426చోట్ల పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేసి మొక్కలను విరివిగా పెంచుతున్నారు. 108చోట్ల బృహత్ ప్రకృతి వనాలను అభివృద్ధి చేశారు. ఇవేకాకుండా రహదారుల వెంట బహుళ వరుసల్లో 271కిలోమీటర్ల మేర మొక్కలను పెంచుతున్నారు. ఇక ప్రభుత్వ స్థలాల సంరక్షణ పేరుతో బ్లాక్ ప్లాంటేషన్ కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. ప్రైవేట్ లేఅవుట్లలోని ప్రభుత్వ అవసరాల కోసం వదిలిన 10శాతం భూమిలో 45చోట్ల పల్లె ప్రకృతి వనాలను పెంచుతున్నారు.
వీటన్నింటి ఫలితంగా ఈ నాలుగేండ్లల్లోనే నల్లగొండ జిల్లాలోనే ఏడు శాతం అటవీ విస్తీర్ణం నుంచి నేడు 9.9శాతానికి పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక ప్రతి గ్రామంలోనూ చెత్తసేకరణ కోసం ప్రత్యేక డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తయ్యింది. వీటిల్లో తడి, పొడి చెత్త నుంచి కంపోస్టు ఎరువును కూడా తయారు చేస్తున్నారు. మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్లో రూ.87వేలు, నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో రూ.43వేల ఆదాయం పంచాయతీలకు సమకూరింది. ఇక గ్రామాల్లో దహనసంస్కారాల్లో ఇబ్బందులకు చెక్ పెడుతూ 844 చోట్ల వైకుంఠధామాలను నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. కోటి మొక్కలను ప్రజలకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంచుతున్నారు. వీటితో పాటు గ్రామాల్లోని 1,131 పాతబోర్లు, 1,761 పాత బావులను సైతం పూడ్చి దోమల వ్యాప్తికి చెక్ పెట్టారు. ప్రభుత్వ చేపడుతున్న మౌలిక వసతుల కల్పనలో ప్రజలు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. గ్రామాల్లో ఆస్తి పన్నుల వసూళ్లు 99శాతం నమోదు కావడం విశేషం. 2017-18లో రూ.12.50కోట్లు ఉన్న వసూళ్లు గత 2021-22లో రూ.16కోట్లకు చేరాయి.
పట్టణాలు, పల్లెలు కళకళ
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం కనీస సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసింది. 2019లో పల్లె ప్రగతి, 2020లో పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టి అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నది. పల్లె ప్రగతి ప్రారంభమైన గత 44 నెలల్లో సూర్యాపేట జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలకు అక్షరాలా రూ.318 కోట్లు విడుదలయ్యాయి. పట్టణ ప్రగతి ప్రారంభమైన 26 నెలల్లో సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు రూ.56.04కోట్లు వచ్చాయి. జిల్లాలో విద్యుత్ శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సుమారు రూ.65 కోట్ల వ్యయంతో విద్యుత్ సమస్యలన్నింటినీ పరిష్కరించింది. పట్టణ ప్రగతిలో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.26.18 కోట్లు, కోదాడ రూ.13.52కోట్లు, హుజూర్నగర్ రూ.6.76కోట్లు, తిరుమలగిరి రూ.3.90 కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.2.86కోట్లు వచ్చాయి. సూర్యాపేట మున్సిపాలిటీలో రూ.4కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్, కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారు.
ప్రకృతి వనం.. పచ్చ తోరణం
చందంపేట, మే 18 : రాబోయే తరాలకు పచ్చని సంపదను అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు పచ్చ తోరణాల్లా దర్శనమిస్తున్నాయి. మండుటెండల్లోనూ పచ్చదనం కళకళలాడుతున్నది. చందంపేట మండలంలోని పలు గ్రామాల్లో వన నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. హరితహారంలో భాగంగా వానకాలంలో నాటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నల్లగొండ మండలం అప్పాజిపేటలో వర్మీకంపోస్టు యార్డు
సిద్ధంగా ఉన్నాం..
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఐదో విడుత పల్లె ప్రగతి కోసం సిద్ధంగా ఉన్నాం. జూన్ 3న ప్రారంభమయ్యే కార్యక్రమంలో వివిధ స్థాయిల్లోని అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం. పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతాం. ఈ సారి గ్రామీణ క్రీడా మైదానాల ఏర్పాటు కూడా ఇందులోనే చేపట్టనున్నాం. ఇప్పటివరకు గ్రామాల్లో రూ.660కోట్లను వెచ్చించి శాశ్వత వనరులను ఏర్పాటు చేయడంతో గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది.
– డి.విష్ణువర్ధన్రెడ్డి, డీపీఓ, నల్లగొండ
పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందాయి
ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. దాంతో వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ప్రతి గ్రామానికీ వైకుంఠధామాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయి.
– మల్లెపాక వెంకన్న, తుంగతుర్తి
గ్రామాల రూపురేఖలు మారిపోయాయి..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. గతంలో గ్రామంలో ఉన్న పాత గోడలు తొలగించి, వీధులను పరిశుభ్రంగా మార్చారు. సీసీ రోడ్లు వేయడంతో వానకాలంలో బురద సమస్య లేకుండా పోయింది. గ్రామాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది.
– చేగొండి కృష్ణ, చల్మారెడ్డిగూడెం, హాలియా
మా ఊరుని బాగు చేసుకున్నాం..
కేసీఆర్ సారు అధికారంలోకి వచ్చినాంకనే మా ఊరు బాగుపడ్డది. 40 ఏండ్ల కిందట మేం సాగర్ ముంపునకు గురై దామరచర్ల మండలంలో స్థిరపడ్డాం. సమైక్య పాలనలో మమ్ములను పట్టించుకున్న పాలకులు లేరు. దామరచర్ల ఆవాసంగా ఎలాంటి వసతులు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డాం. పనుల్లేక ఎంతో మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ మా ఊరును పంచాయతీగా మార్చారు. నేను తొలి సర్పంచ్గా ఎన్నికై పల్లె ప్రగతి ద్వారా ఎంతో అభివృద్ధి చేశాను. వైకుంఠ ధామం, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు నిర్మాణంతో పాటు రోడ్లను తీర్చిదిద్దుకున్నాం. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందుతున్నది.
– గజ్జెల వరలక్ష్మి, రాజగట్టు సర్పంచ్, దామరచర్ల
ఏండ్ల సమస్యలు తీరిపోయాయి
గ్రామాల్లో ఏండ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలకు పల్లెప్రగతి పరిష్కారం చూపింది. గతంలో చెత్తా చెదారంతో పాటు గుంతలమయమైన వీధులు దర్శనమిచ్చేవి. కానీ, నేడు అటువంటి పరిస్థితి లేదు. పల్లె ప్రగతి పుణ్యమా అని పల్లెలు పరిశుభ్రంగా మారడంతో పాటు వీధులు సీసీగా మారిపోయాయి. చేతికందే ఎత్తులో వేలాడే విద్యుత్ తీగలను సరిచేసి పాత స్తంభాలు తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇటువంటి మంచి పథకం అమలు చేయడం నిజంగా సంతోషకరం.
– కె.శ్రీనివాసరావు, కట్టవారిగూడెం, గరిడేపల్లి