నీలగిరి, ఏప్రిల్ 26 : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 1.12 కోట్ల నగదు, రెండు కార్లు, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించిననట్లు ఎస్పీ అపూర్వరావు తెలిపారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మిర్యాలగూడకు చెందిన బంటు రాజేశ్కుమార్ గతంలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడి జైలుకు వెళ్లొచ్చి మూడు ఏండ్లుగా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిసున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయగా ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి మిర్యాలగూడ కేంద్రంగా బెట్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు.
రాజేశ్కుమార్తోపాటు మరికొంత మంది ఈ నెల 25న మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో మిర్యాలగూడలోని మయూరినగర్ హౌసింగ్బోర్డులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసిందన్నారు. దాంతో మిర్యాలగూడ వన్టౌన్ సీఐ రాఘవేందర్, ఎస్ఐ శివతేజ్, టాస్ఫోర్స్ సిబ్బంది, స్పెషల్ టీమ్ సంయుక్తంగా రాజేశ్ ఇంట్లోకి ప్రవేశించి ఆన్లైన్లో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న రాజేశ్తోపాటు కోలా సాయికుమార్, రాచకొండ జీవన్కుమార్, నోట్ల సత్యనారాయణ, శాకమూరి ఉదయ్కుమార్, బంటు సంతోష్, గంధం నవీన్ కుమార్, బంటు వంశీకృష్ణ , కొండవీటి రాజేశ్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు చెప్పారు. రాజేశ్కుమార్ టెలిగ్రామ్ యాప్ ద్వారా హార్దిక్ బుకీ ప్యానల్ (https:// dubaiexch24.com) నుంచి మెయిన్ లైన్ యాక్సెస్ తీసుకుని బెట్టింగ్ చేస్తున్నట్లు తెలిసిందన్నారు.
ఈ ఆన్లైన్ లింక్ను తన బామ్మర్ది కోలా సాయికుమార్కు ఫార్వర్డ్ చేసి ఈ యాప్ ద్వారా మొబైల్ ఫోన్స్కు కనెక్ట్ చేసి ఆన్లైన్లో చాలామందికి కాయిన్స్ రూపంలో కమీషన్ ద్వారా నెట్వర్క్లో జాయిన్ చేసుకుని బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పెడుతూ సులువుగా డబ్బు సంపాదిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్, అధిక వడ్డీ వ్యాపారాలు చేసేవారిపై పీడీయాక్ట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన డీఎస్పీ వెంకటగిరి, మిర్యాలగూడ వన్టౌన్ సీఐ రాఘవేందర్, ఎస్ఐను ఎస్పీ అభినందించారు.
దేవరకొండ : ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను బుధవారం దేవరకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. దేవరకొండ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండలోని గణేశ్నగర్కు చెందిన పులిజాల శ్రీనివాస్ తన స్నేహితులైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మిర్జాపూర్కు చెందిన సైలేశ్కుమార్, ఇమాన్స్పటేల్తో కలిసి తన ఇంట్లో ఐపీఎల్ బెట్టింగ్కు పాల్పడుతున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకొన్నారు. టెలిగ్రామ్ ద్వారా యాప్ను ఓపెన్చేసి అన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి రూ.3.76 లక్షల నగదు 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. దాడుల్లో ఎస్ఐలు సుధీర్కుమార్, సతీశ్ పాల్గొన్నారు.