సూర్యాపేట, జూలై 26 (నమస్తే తెలంగాణ) : నిత్యావసర వస్తువులపై వేసిన జీఎస్టీ, ధరల పెంపు నిరసించడంతోపాటు రాష్ట్రంలో వరదలతో నష్టపోయిన ప్రాంతాలకు నష్టపరిహారం చెల్లించాలని పార్లమెంట్లో గళమెత్తిన రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ను బీజేపీ సర్కారు వారంపాటు సస్పెండ్ చేసింది. పన్నులు తగ్గించాలంటూ పార్లమెంట్ వెల్లోకి వెళ్లి నిరసన తెలుపుతున్న తమను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఈ సందర్భంగా ఎంపీ బడుగుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఇలా అన్ని రంగాల వారిని ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తున్నదని మండిపడ్డారు. మరోవైపు ప్రభుత్వ సంస్థలను అమ్ముకునే పనిలో ఉందని దుయ్యబట్టారు. మరోపక్క ప్రభుత్వ సంస్థలను అమ్ముకునే పనిలో ఉన్నదన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై సభలో ప్రశ్నిస్తే ప్రధాని లేదా మంత్రులు సమాధానం చెప్పకుండా పారిపోతూ ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేయడం సిగ్గుచేటన్నారు.
రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తే సీఎం కేసీఆర్ పర్యటించి రూ. వెయ్య కోట్లు ప్రకటించడం.. ప్రతి మనిషికి 25 కిలోల బియ్యం, రూ.10 వేల నగదు ఇచ్చినట్లు తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి పంపిస్తే కనీసం స్పందన లేదన్నారు. అసలు తెలంగాణను, ఇక్కడి ప్రజలను భారత్లో ఉన్నట్లుగా గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించలేని విధంగా పన్నుల భారం మోపుతూ కార్పొరేట్లకు ఎర్రతివాచీలు పరిచి లక్షల కోట్లు దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని, తమని ఎన్నిసార్లు సస్పెండ్ చేసినా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.