నల్లగొండ సిటీ, జూన్ 5 : రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిని అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సూచించారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నల్లగొండ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్లో సోమవారం నిర్వహించిన విద్యుత్ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో విద్యుత్ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగానికి పెద్ద పీట వేసి వ్యవసాయానికి నిరంతర ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్నదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్లు, ల్యాండ్రీ షాపులు, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడంతోపాటు చేనేత రంగానికి సబ్సిడీపై సరఫరా చేస్తున్నదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పగలు 4, రాత్రి 3గంటలు కరంట్ ఇస్తే అధిక లోడ్తో మోటర్లు కాలిపోయేవని పేర్కొన్నారు.
రైతులు రాత్రి సమయంలో పొలాల వద్దకు వెళ్లి పాము కాట్లకు గురయ్యే వారని తెలిపారు. ఇప్పుడు 24 గంటల కరంట్తో రైతులు హాయిగా నిద్ర పోతున్నారన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. గతంలో కరెంట్ లేక పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలి వెళ్లాయని, ఇప్పుడు ఇతర దేశాల కంపెనీలు సైతం తరలివస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో విద్యుత్పై ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్రం ఏర్పాటైన రెండో సంవత్సరంలోనే రైతులకు 9గంటల నికర విద్యుత్, మరుసటి ఏడాది నుంచి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నారని తెలిపారు. భవిష్యత్లో విద్యుత్కు ఇబ్బందులు లేకుండా సీఎం కేసీఆర్ ముందుచూపుతో దామరచర్లలో రూ.30 వేల కోట్లతో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
కలెక్టర్ టి.వినయ్క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ దేశంలో తలసరి విద్యుత్ వినియోగం సగటు కంటే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల తలసరి వినియోగం 70శాతం ఎక్కువగా ఉన్నదన్నారు. ఒక్కొక్క వినియోగదారుడికి ప్రభుత్వం ద్వారా ఎంత లబ్ధి చేకూరుతుందో సవివరంగా వివరించారు. తెలంగాణ రాక ముందు తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో విద్యుత్ విజయాలపై డీఈ శంకరయ్య పవర్పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. కార్యక్రమంలో కనగల్, తిప్పర్తి ఎంపీపీలు కరీంపాషా, విజయలక్ష్మి, జడ్పీటీసీ చీట్ల వెంకటేశం, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్యాదవ్, బీఆర్ఎస్ నాయకులు వంగాల సహదేవ్రెడ్డి, ఉట్కూరి వెంకట్రెడ్డి, ఖయ్యూంబేగ్, వట్టిపల్లి శ్రీనివాస్, యామ దయాకర్, జెర్రిపోతుల భాస్కర్, అలకుంట్ల మెహన్బాబు, సందీప్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.