సూర్యాపేటటౌన్, డిసెంబర్ 19 : గత ప్రభుత్వాలు కులవృత్తులను నిర్లక్ష్యం చేశాయని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కులవృత్తులకు పెద్దపీట వేసి వృత్తిదారులను ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కుమ్మరి వృత్తిదారులకు సోమవారం సూర్యాపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రూ.6.40 లక్షల వ్యయం గల సబ్సిడీ కుమ్మరి యంత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం శాలివాహన కుల వృత్తిదారులకు 80 శాతం సబ్సిడీతో రాష్ట్రంలో 320 మంది లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చి ఆధునిక యంత్రాలు అందజేసినట్లు తెలిపారు. జిల్లాలో 8 యంత్రాలను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వృత్తులను సమానంగా చూస్తూ వృత్తిదారులకు ఉపాధి కల్పిస్తున్నదన్నారు. ఎనిమిదేండ్లలో యాదవులకు గొర్రెలు, మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు, కుమ్మరులకు కుండల యంత్రాలు సబ్సిడీపై అందజేస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. పథకాలను వృత్తిదారులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని సూచించారు.
సూర్యాపేటలో రూ.80 లక్షలతో కుమ్మరి సంఘ భవనం నిర్మించడంతోపాటు నేడు వృత్తిదారుల సౌకర్యార్థం సబ్సిడీ యంత్రాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా అదనపు కలెక్టర్ మోహన్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, రాష్ట్ర కుమ్మరి సంఘం ఉపాధ్యక్షుడు ఏడుకొండల వెంకటేశం, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ ఉప్పల లలితాఆనంద్, బీసీ సంక్షేమాధికారి అనసూయ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.