నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో చదివే పలువురు విద్యార్థులు తెలంగాణ సాహిత్య అకాడమీ పిలుపుతో 150 గ్రామాల చరిత్రలు రాశారు. వాటిని ఆ కళాశాల తెలుగు శాఖ అధిపతి, మన ఊరు – మన చరిత్ర జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ తండు కృష్ణ కౌండిన్యకు అందజేశారు. వారు త్వరలోనే తెలంగాణ సాహిత్య అకాడమీకి అందజేస్తారు. అనంతరం సాహిత్య అకాడమీ పుస్తకంగా ప్రచురించనుంది. ఇది గొప్ప అవకాశంగా విద్యార్థులు భావిస్తున్నారు.
ఒక్క సిరా చుక్క లక్ష
మెదళ్లకు కదలిక అన్నారు కాళన్న. ఆ మాటలను నిజం చేస్తూ మన ఊరి చరిత్రను, ఆ మాటకొస్తే.. ప్రతి ఊరి చరిత్రనూ తవ్వితీసి అక్షరబద్ధం చేస్తున్నది తెలంగాణ సాహిత్య అకాడమీ. ఒక్క ఆలోచనతో పురుడు పోసుకున్న ఈ బృహత్తర కార్యక్రమం ఒక మహాయజ్ఞంలా సాగుతున్నది. యువతరంలోని రచనాశక్తిని మేల్కొల్పుతున్నది. మన చరిత్రను మనం తెలుసుకోవాలన్న జిజ్ఞాసను పెంపొందిస్తున్నది. మన ఘన కీర్తిని భావితరాలకు భద్రంగా అందించే బాధ్యతను నేడు నవలోకం భుజాలకెత్తుతున్నది. తెలంగాణ సాహిత్య అకాడమీ సంకల్పంతో నల్లగొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా మొదలైన ’మన ఊరు-మన చరిత్ర’ నేడు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నది. ఎన్జీ కాలేజీ విద్యార్థులు 150 మంది ఇప్పటికే పలు గ్రామాల చరిత్రకు అక్షర రూపమిచ్చి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
సాహిత్యం అంటే నాటి, నేటి చరిత్రకు దర్పణం. అలాంటి అంశాలను వెలికితీసి నేటి తరానికి పరిచయం చేసేలా తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ రాష్ట్ర కాలేజ్ ఎట్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ముందుకు సాగుతున్నాయి. ఎన్జీ కళాశాలలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయగా విజయవంతం కావడంతో తెలంగాణ రాష్ట్ర కాలేజ్ ఎట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్మిట్టల్ ‘మన ఊరు-మన చరిత్ర’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాహిత్యంపై అవగాహన కల్పించి వారితోనే ఆయా గ్రామాల చరిత్రను రాయించేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు డిగ్రీ దశలోనే సాహిత్యంపై ఆలోచన స్థాయిని కల్పించడంతోపాటు మరుగునపడ్డ మన గ్రామాల చరిత్ర వెలికితీసే ఉద్దేశమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. మన ఊరు – మన చరిత్రతో గ్రామాల నైసర్గిక స్వరూపం తెలియనుంది. ఇందుకోసం అన్ని జిల్లాల్లో సీనియర్ తెలుగు అధ్యాపకులను జిల్లా కోఆర్డినేటర్లుగా నియమించారు. వారు ఇప్పటికే సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్గా ఎన్జీ కళాశాల తెలుగు శాఖ అధిపతి డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, సూర్యాపేటకు కోదాడ కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీనియర్ తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ నందిగామ నిర్మలాకుమారి, యాదాద్రి భువనగిరి జిల్లా కోఆర్డినేటర్గా రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బెల్లి యాదయ్యను నియమిస్తూ నవీన్మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. వారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించి చైతన్యం చేస్తున్నారు.
‘మన చరిత్ర.. మనం రాసుకుందాం’ శ్రీకారం చుట్టింది ఇలా..
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, రచయిత, కవి, విమర్శకులు జూలూరు గౌరీశంకర్ మదిలో తోచిన సంకల్పమే మన చరిత్ర.. మనం రాసుకుందాం. చరిత్ర మూలాలను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. మొదటగా 2022 మార్చి 29న నల్లగొండ ఎన్జీ కళాశాలలో అప్పటి జిల్లా అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్తో కలిసి విద్యార్థులకు సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. దాంతో పలువురు విద్యార్థులు గ్రామాల చరిత్రలు రాసి స్ఫూర్తిగా నిలిచారు. 1950-51 సంవత్సరంలో అప్పట్లో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ దూబే 15మంది విద్యార్థులతో కలిసి శామీర్పేటలో పర్యటించి అక్కడి సామాజిక అంశాలపై ఇండియన్ విలేజ్ (భాతర గ్రామం) పుస్తకం రాశారు. అది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుస్తకంగా నేడు ప్రాచుర్యంలో ఉన్నది. నేడు ఆ గ్రంథం సామాజికమైన శాస్ర్తాలకు గ్రామీణ ప్రాంతాలపై పరిశోధనకు నిదర్శనంగా మారిందని సాహితీవేత్తలు వెల్లడిస్తున్నారు. అదేవిధంగా బీఎన్ శాస్త్రి ఆనాడు వందల మంది విద్యార్థులతో 1200 పేజీలుగా ఒక పుస్తకం రాయించారు. వాటి స్ఫూర్తితోనే తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మన చరిత్ర.. మనం రాసుకుందాం అనే అంశాన్ని ఎన్జీ విద్యార్థులకు, అధ్యాపకులకు పరిచయం చేశారు జూలూరు గౌరీశంకర్. తెలంగాణ రాష్ట్ర పున్నర్నిర్మాణంలో భాగంగా కొత్త మలుపు తిరుగుతున్న స్వరాష్ట్ర చరిత్రలో గ్రామ చరిత్ర అంశాలను భావి తరమైన విద్యార్థులే రచించేలా ఆహ్వానించారు. దాంతో 150 మంది విద్యార్థులు వారి ప్రాంతాల్లోని చరిత్ర అంశాలు, శానసనాలను రికార్డు చేసి రాశారు. వారిని ప్రశంసించిన తెలంగాణ రాష్ట్ర కాలేజ్ ఎట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్మిట్టల్ సాహిత్య అకాడమీతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిగ్రీ కళాశాలల్లో ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశారు.
మన ఊరు – మన చరిత్రలో రాసే అంశాలివే..
విద్యార్థుల్లో రచన, సాహిత్య శక్తిని వెలికితీసే అంశం
పిల్లల్లో అపారమైన జ్ఞాన శక్తి ఉంది. దానికి పదునుపెట్టి వెలికితీసే అంశమే ఇది. అంతేకాకుండా విద్యార్థుల్లో రచనా శక్తిని వెలికితీసేలా, నాటి చరిత్రను నేటి తరానికి అందించేలా సాహిత్య అకాడమీ, తెలంగాణ కాలేజ్ ఎట్ ఎడ్యుకేషన్ చర్యలు తీసుకోవడం హర్షణీయం. మా కళాశాలలో 150 మంది విద్యార్థులు గురుతరమైన బాధ్యతగా భావించి వారి గ్రామాల చరిత్రను రాసి స్ఫూర్తిగా నిలిచారు. విద్యార్థులు రాసే అంశాలతో చాలా మందికి మన ఊరి చరిత్రలు తెలువనున్నాయి. ఇది విద్యార్థులను చరిత్రకారులుగా, సాహిత్య వేత్తలుగా తయారు చేసేలా నిలుస్తుంది. ఈ అవకాశం రావడం విద్యార్థులు చాలా అదృష్టంగా భావించాలి. తన వంతుగా పూర్తి సహకారం అందిస్తూ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి విద్యార్థులకు మన ఊరు – మన చరిత్ర విశిష్టతను తెలిపి స్ఫూర్తి నింపాం. ప్రతి కళాశాలలో ప్రత్యేక కమిటీలు వేశాం. వారి ద్వారా గ్రామాల చరిత్రను ఎలా రాయాలో విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించాం. నల్లగొండ జిల్లా రాష్ట్రంలో అన్ని కళాశాలలకు మరోసారి స్ఫూర్తిగా నిలిచేలా అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నాం. దీనికి సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, కళాశాల విద్యా శాఖ కమిషనర్ నవీన్మిట్టల్ సహకారం ఎంతో ఉంది.
– డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, మన ఊరు – మన చరిత్ర జిల్లా కో ఆర్డినేటర్, ఎన్జీ కళాశాల తెలుగు విభాగం అధిపతి, నల్లగొండ
చరిత్రను వెలికితీసి అందించడమే..
మరుగున పడిన చరిత్రను వెలికి తీసి నేటి తరానికి అందించే చక్కటి అవకాశాన్ని విద్యార్థులకు డిగ్రీలోనే తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ కాలేజ్ ఎట్ ఎడ్యుకేషన్ కల్పించిన గొప్ప అవకాశం. దేశ చరిత్రలో ఎన్నో అంశాలు ఇలా రాసినవే. విద్యార్థులను ఇలాంటి వాటిల్లో భాగస్వామ్యం చేయడంతో కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయి. మరో వైపు విద్యార్థులకు పరిశోధన వైపు ఆలోచించే అవకాశం దక్కుతుంది. ఇలాంటి అంశాలు నవ శకానికి నాంది పలుకుతాయి. మా కళాశాల విద్యార్థుల స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు- మన చరిత్ర అమల్లోకి తీసుకురావడం గర్వంగా ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా అధ్యాపకులు ప్రోత్సహించి విజయవంతం చేయాలి.
– డాక్టర్ ఘన్శ్యాం, ఎన్జీ, ఉమెన్స్ కళాశాలల ప్రిన్సిపాల్, నల్లగొండ
గాంధీనగర్ చరిత్ర రాశా
నేను ఎన్జీ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతుండగా నిర్వహించిన సమావేశం ఆలోచనలోకి నెట్టింది. ఎన్జీలో 2019-2022లో డిగ్రీ బీఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసి ప్రస్తుతం బీఈడీ ఫస్టియర్ చేస్తున్నా. ఈ ఏడాది మార్చి 29న కళాశాలలో నిర్వహించిన సమావేశంలో మన ప్రాంతాల అంశాలను చరిత్ర రూపంలో రాయాలనే ఆలోచనను కల్పించారు. దాంతో మా కళాశాల తెలుగు శాఖ విభాగం అధ్యాపకుల సలహాలతో నల్లగొండ పట్టణంలోని గాంధీనగర్కు ఆ పేరు ఎలా వచ్చిందో కాలనీ పెద్దలను సంప్రదించి రాశా. గాంధీనగర్ చరిత్ర రాసేందుకు మా నాయినమ్మ నర్సమ్మ చాలా సహకారం అందించారు. గ్రూప్స్ పరీక్షలో చరిత్ర ఒక సబ్జెక్టు కాబట్టి పోటీ పరీక్షల్లో నేను సేకరించిన సమాచారం ఉపయోగపడుతుందనే విషయం తెలిసింది. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ సాహిత్య అకాడమీకి కృతజ్ఞతలు.
– కోట్ల ఫణిశ్రీ, ఎన్జీ కాలేజీ విద్యార్థిని, నల్లగొండ
మా ఊరు నర్సింగ్భట్ల చరిత్ర రాశా
నేను ఎన్జీ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం బీజడ్సీ చదువుతున్నా. సాహిత్య అకాడమీ తెలిపిన అంశంలో భాగంగా మా ఊరు నర్సింగ్భట్ల చరిత్ర రాశాను. మా తాతయ్య, నాయినమ్మతోపాటు పెద్దనాన్నతో గ్రామంలోని పెద్దవారిని కలిసి చరిత్రను రాశాను. దాంతో మా పూర్వికుల పేర్లు, వివరాలు నాకు తెలిశాయి. డిగ్రీలోనే చరిత్రను తెలుసుకుని రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ వైపు పరుగు తీస్తున్న యువతకు మరుగున పడుతున్న చరిత్రను నేటి తరానికి అందించే గొప్ప విషయం ఇది.
– బడుపుల మాధురి, డిగ్రీ ఫైనలియర్, ఎన్జీ నల్లగొండ