సర్కారు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించడంతోపాటు అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నది. భోజన వసతితోపాటు కనీస అవసరాలు తీరుస్తున్నది. కస్తూర్బా విద్యాలయాల్లో చదివే బాలికలకు గతంలో 15 రకాల వస్తువులతో హెల్త్కిట్లు అందించగా కరోనా కారణంగా అవాంతరాలు ఏర్పడ్డాయి. విద్యార్థినులకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం హెల్త్కిట్ల స్థానంలో అంతే మొత్తంలో నగదు ఇవ్వడానికి నిర్ణయించింది. నెలకు రూ.100 చొప్పున విద్యార్థినుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నది. ఇందుకోసం విద్యాశాఖ బాలికల బ్యాంకు అకౌంట్ వివరాలు తీసుకుంటున్నది.
మునుగోడు, డిసెంబర్ 19 : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినులకు నగదు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్య కిట్ల స్థానంలో ఒక్కొక్కరికి నెలకు రూ.100 చొప్పున చెల్లించాలని సర్కారు విద్యాశాఖను ఆదేశించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాలికల బ్యాంకు ఖాతాలను జిల్లా విద్యాశాఖ అధికారులు సేకరిస్తున్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 56 కేజీబీవీ పాఠశాలలు, 28 కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో 14,674 మంది బాలికలు చదువుతున్నారు. కేజీబీవీలో పేద విద్యార్థులే అధికంగా చదువుకుంటుండగా.. ప్రభుత్వం ఉచిత విద్యతోపాటు వసతి, భోజనం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నది. అయితే.. కరోనా కంటే ముందు విద్యార్థినులకు 15 రకాల వస్తువులతో కూడిన ఆరోగ్య కిట్లను అందించింది. కరోనా కారణంగా రెండేండ్లుగా కిట్ల పంపిణీ నిలిచిపోయింది. ఆరోగ్యానికి, వ్యక్తిగత శుభ్రతకు సంబంధించిన వస్తువులను సమకూర్చుకునేందుకు విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం కిట్ల స్థానంలో నగదు ఇవ్వాలని నిర్ణయించింది.
విద్యార్థినుల ఖాతాల్లోనే జమ
విద్యార్థినులను అందివ్వనున్న నగదును నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు బాలికలతో బ్యాంకు ఖాతాలను తెరిపిస్తున్నారు. అకౌంట్ ఉన్న వారి నంబర్లను సేకరిస్తున్నారు. ఇటీవల కస్తూర్బా పాఠశాలల్లో విద్యార్థినులకు ఆధార్ నమోదు చేపట్టారు. కొంత మందికి ఖాతాలు లేవని తేలడంతో ఆధార్తోపాటు సదరు ప్రక్రియను పూర్తి చేయించేలా చొరవ చూపుతున్నారు. ఇది పూర్తివగానే నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థినులందరికీ నెలకు రూ.100 చొప్పున జమ కానున్నాయని జిల్లా సెక్టోరియల్ అధికారి పెండ్యాల సరిత తెలిపారు.