హాలియా, డిశంబర్ 16 : వరద కాల్వ పరిధి లోని డి-8, 9 లిఫ్ట్ కింద ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దవూర మండలంలోని డి-8,9 కాల్వలపై నిర్మిస్తున్న లిఫ్ట్ నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే పరిశీలించారు. సాగునీటిశాఖ అధికారులు లిఫ్ట్ నిర్మాణ పనులను ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే భగత్కుమార్ మాట్లాడుతూ గత పాలకుల నిర్వాహాకం వల్ల తలాపున కృష్ణానది ప్రవహిస్తున్నా పెద్దవూర, తిరుమలగిరి సాగర్ మండలాలకు తాగు, సాగు నీరివ్వలేకపోయారన్నారు. ఈ విషయమై తమ తండ్రి, దివంగత శాసనస భ్యుడు నోముల నర్సింహయ్య విన్నపం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఉపఎన్నికలకు ముందు నెల్లికల్లు లిఫ్ట్తోపాటు డి-8, 9 కాల్వలపై లిఫ్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. ప్రస్తుతం కాల్వలపై లిఫ్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి నెలరోజుల్లో లిఫ్ట్ కింద ఉన్న చివరి భూములకు సాగునీరిచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
నెల్లికల్లు, డి-8, 9 లిఫ్ట్లను పూర్తి చేసి కృష్ణపట్టే ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. అదేవిధంగా అనుముల మండలంలోని ఆర్-1 లిఫ్ట్ పనులను పరిశీలించారు. ఆర్-1 లిఫ్ట్ కింద 1200 ఎకరాలకు గాను 800 ఎకరాలకే సాగునీరందుతుందని రైతులు ఎమ్మెల్యేకు విన్నవించారు. అయితే పైపులు దెబ్బతినడంతోనే కాల్వ చివరి భూములకు నీరందడం లేదని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయిస్తానని రైతులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆయన వెంట తిరుమలగిరి సాగర్ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య, హాలియా పాక్స్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తిరుమలేశ్, మండల యూత్ ప్రధానకార్యదర్శి రాజేశ్నాయక్, మల్లికార్జున్, సాగునీటిశాఖ డీఈ సీతారాంనాయక్, ఏఈ వేణుగోపాల్ రవినాయక్ ఉన్నారు.