నందికొండ, డిసెంబర్ 10 : ఆధునిక దేవాలయంగా పేరొందిన నాగార్జునసాగర్ డ్యామ్ మానవ నిర్మిత గొప్ప రాతి కట్టడం అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్ణ బ్రహ్మానందరెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు పునాది వేసి నేటికి 67 ఏండ్లు పూర్తి అవడంపై పైలాన్కాలనీలోని డ్యాం శంకుస్థాపన పిల్లర్ వద్ద, డ్యామ్కు అవతల వైపు ఉన్న ఆంధ్ర ప్రాంతం రైట్ బ్యాంక్లోని డ్యామ్ శంకుస్థాపన పిల్లర్ వద్ద శనివారం ఎన్ఎస్పీ అధికారులతో కలిసి పూజలు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1955లో నాగార్జునసాగర్ డ్యామ్ పనులు ప్రారంభమై 12 సంవత్సరాల పాటు కొనసాగి 1967లో పూర్తి అయినట్లు తెలిపారు. నిరంతరం సుమారు 40 వేల మంది కార్మికులు ప్రాజెక్ట్ నిర్మాణంలో పనిచేసినట్లు చెప్పారు. నిజాయితీతో పని చేసిన ఇంజినీర్లు, అధికారుల సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రమం తప్పకుండా రెండు పంటకుల నీరు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీఎఫ్, ఎన్ఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.