యాదాద్రి, డిసెంబర్ 7 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. అనంతరం నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు.
గంటన్నర పాటు అర్చక బృందం శాస్ర్తోక్తంగా స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం జరిపించింది. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శ ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. అనంతరం లక్ష్మీసమేతుడైన కల్యాణమూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్టించి నిత్యకల్యాణ తంతు జరిపించారు.
సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 10వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.16,52,192 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
తిరుప్పాణియాళ్వారు తిరునక్షత్రోత్సవం
యాదాద్రి దివ్యక్షేత్రంలో తిరుప్పాణియాళ్వారు జన్మనక్షత్రం సందర్భంగా తిరు నక్షత్రోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఆలయ ముఖ మండపంలోని ఆళ్వారు సన్నిధి వద్ద తిరుప్పాణియాళ్వారులను వేంచేపు చేసి తిరుమంజనం గావించి పారాయణాలు పఠించారు. సాయంత్రం ఆళ్వారులకు ప్రత్యేకంగా పురప్పాట్ సేవ నిర్వహించారు.