పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి నర్సరీలు సిద్ధమవుతున్నాయి. మొక్కల పెంపు కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 50లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించగా ఆ దిశగా పనులు ప్రారంభిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో నర్సీరీలు ఏర్పాటు చేసి సుమారు 30 రకాల మొక్కలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించారు. వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పంచాయతీని బట్టి ఒక్కో నర్సరీలో కొత్తవి, పాతవి కలిపి 10 వేల నుంచి 15 వేల మొక్కలు పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
నేరేడుచర్ల, డిసెంబర్ 7: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరిత హారానికి మొక్కలు నాటేందుకు గ్రామానికో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపట్టిన విషయం విదితమే. 14వ విడుత హరితహారానికి కావాల్సిన మొక్కలను సిద్ధం చేయడానికి నర్సరీల్లో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. చిన్న పంచాయతీల్లో 10 వేలు, పెద్ద పంచాయతీల్లో 15 వేల మొక్కలు పెంచడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి దానికి అనుగుణంగా పనులు చేపడుతున్నారు. జిల్లాలోని అన్ని నర్సరీల్లో ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో పనులు ప్రారంభమయ్యాయి. మొక్కలకు కావాల్సిన మట్టిన నర్సరీలకు చేరుస్తుండగా, కొన్ని పంచాయతీల్లో ప్యాకెట్లలో మట్టిని నింపే పనులు పూర్తి చేసి మొక్కలు నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. మరి కొన్ని చోట్ల మట్టి జల్లెడు పట్టి ప్యాకెట్లను నింపడానికి సిద్ధమవుతున్నారు.
50,53,700 లక్షల మొక్కలు
జిల్లాలోని 475 గ్రామ పంచాయతీల్లో మొత్తం 50 లక్షల 53వేల 700మొక్కలు పెంచేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నర్సరీల్లో ముఖ్యంగా పూలు, పండ్లు మొక్కలు పెంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది నర్సరీల్లో మొక్కలను సంరక్షించి హరితహారంలో భాగంగా నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నర్సరీల ద్వారా ఉపాధి కూలీలకు పని దొరుకుతుంది. గతంలో మాదిరిగా పనులు కోసం వెతుకులాడాల్సిన పని లేకుండా పోయింది. చాలా మంది కూలీలకు తమ ఊరులోనే పని దొరకడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిరంతరం అధికారుల పర్యవేక్షణ
నర్సరీల్లో చేపట్టే మొక్కల పెంపకాన్నిఅధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్యాకెట్లలో నింపే మట్టి నుంచి మొక్కలను పెంచి గ్రామంలో పంచే వరకు అధికారులు పర్యవేక్షణలో కొనసాగుతున్నది.
వనసేవకులకు ప్రతి రోజు రూ. 257
గ్రామాల్లో నర్సరీల్లో పనిచేసే వన సేవకులకు ప్రతి రోజు రూ. 257 కూలి ప్రభుత్వం చెల్లిస్తున్నది. వీరు మొక్కలకు ప్రతి రోజు నీటిని పెట్టడంతో పాటు మొక్క ఎత్తు, ఎదుగుదల ప్రకారం వాటిని గ్రేడింగ్ చేయడంతో పాటు షిఫ్టింగ్ చేయాలి. చనిపోయిన మొక్కలు ఉంటే వాటిని తొలగించి ఆ స్ధానంలో విత్తనాలను విత్తాలి. మొక్కల మధ్య కలుపు లేకుండా చూసుకోవాలి. నర్సరీల్లో తప్పని సరిగా రిజిస్టర్ను అందుబాటులో ఉంచి, నర్సరీలో ఎన్ని మొక్కలు, ఏఏ మొక్కలు పెంచుతున్నామో వివరాలను పొందుపర్చాలి. అంతే కాకుండా నర్సరికీ వచ్చి పోయే వారి వివరాలను నమోదు చేయాలి.
ప్రభుత్వ లక్ష్యం మేరకు పనులు
14 వ విడత హరితహారం కోసంజిల్లాలోని అన్ని నర్సరీల్లో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా నర్సరీల్లో మొక్కల పెంపకానికి కావాల్సిన మట్టిని తీసుకొచ్చి ప్యాకెట్లలో నింపడానికి జల్లెడ పడుతున్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు హరితాహారం విజయవంతం చేయడం కోసం ప్రతి గ్రామ పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి వాటిలో మొక్కలను పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
– సుందరి కిరణ్కుమార్, డీఆర్డీఏ పీడీ, సూర్యాపేట