సూర్యాపేట, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉండడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు సైతం ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాయి. ఇంచు భూమి వదలకుండా రైతులు పంటలు పండిస్తుండడం, మరో పక్క రైతుబంధుతో పెట్టుబడి సాయం అందుతుండగా వ్యవసాయం పండుగలా మారి దాని అనుబంధ సంఘాలు బలోపేతం అవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు పండించిన పంటలు కొనుగోలు చేసే వ్యవసాయ మార్కెట్లు గత రెండేండ్లుగా ఆదాయం తగ్గిపోగా నేడు మళ్లీ ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాయి.
‘పేట’ మార్కెట్కు 10 నెలల్లోనే 135 శాతం పెరిగిన ఆదాయం
రాష్ట్రంలోనే అతిపెద్ద రెగ్యులేటెడ్ మార్కెట్లలో ఒకటైన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు గత రెండేండ్ల తరువాత ఆదాయం పెరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం పది నెలల కాలంలోనే ఏకంగా 135 శాతం పెరుగడం గమనార్హం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 4.50 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేయగా జనవరి వరకు అంటే కేవలం 10 నెలల్లోనే 6.11 కోట్ల ఆదాయం సమకూరి 135 శాతంగా నమోదైంది. అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరంలో 5.80 కోట్లకు 370 కోట్లు వసూలై 65 శాతంగా నమోదైంది. 2020-21లో 5.74 కోట్లకు 455 కోట్లతో 79 శాతం ఆదాయం సమకూరింది.
కోదాడ మార్కెట్లో 2019-20 ఆర్థిక సంవత్సరంలో 3.10 కోట్ల ఆదాయం అంచనా ఉండగా 2.41 కోట్లతో 78 శాతం, 2020-21లో 3.10 కోట్లకు 2.76 కోట్లతో 89 శాతం రాగా, 2021-22 పది నెలల్లో 2.25 కోట్లకు 2.73 కోట్లతో 121 శాతంగా నమోదైంది. హుజూర్నగర్ మార్కెట్లో 2019-20లో 2.93 కోట్లకు 2.70 కోట్లతో 92 శాతం, 2020-21లో 2.93 కోట్లకు 2.55 కోట్ల ఆదాయంతో 87 శాతం ఆదాయం రాగా, 2021-22 పది నెలల్లో 2.78 కోట్లకు 3.29 కోట్లతో 118 శాతం ఆదాయం వచ్చింది. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో 2019-20లో 1.32 కోట్ల అంచనాకు 1.18 కోట్లతో 89 శాతం, 2020-21లో 1.32 కోట్లకు 67 లక్షలు మాత్రమే ఆదాయం సమకూరి 51 శాతం నమోదైంది. 2021-22 పది నెలల్లో 2.35 కోట్లకు 2.38 కోట్ల ఆదాయం సమకూరి 100 శాతం ఆదాయం లభించింది.
రెండేండ్ల తరువాత పెరుగుతున్న ఆదాయం
రెండేండ్ల తరువాత జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ల ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. రెండేండ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకురావడంతో మార్కెట్ల వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారిన విషయం విధితమే. దాని ఎఫెక్ట్ తొలుత మార్కెట్లపై పడి ఆదాయం తగ్గిపోయింది. ఆ చట్టాలతో గత రెండేండ్లుగా వ్యవసాయ మార్కెట్లకు వచ్చిన పంటల విక్రయాలపై వచ్చే 1 శాతం సెస్ మినహా మార్కెట్ ఆవల జరిగే లావాదేవీలపై సెస్ జీరోకు చేరుకుంది. చెక్ పోస్టులు మూతపడ్డాయి. డైరెక్ట్ ఇంపోర్ట్ లేకపోవడం, మిల్లర్లు బయట కొనుగోలు చేసిన పంటలపై సెస్ రాకపోవడంతో మార్కెట్ యార్డులకు భారీగా ఆదాయం తగ్గింది. కాగా దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళనలకు తలొగ్గిన కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో మళ్లీ మార్కెట్లకు మంచిరోజులు వచ్చాయి.
మరింత ఆదాయం పెంచేందుకు కృషి చేస్తాం
గత ఏడాది కాలంగా ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పటికీ మార్కెట్ యార్డుకు అత్యధికంగా పంటలు వస్తున్నాయి. దీనికి కారణం వ్యాపారులతో చర్చలు చేస్తూ పోటీ పడి అధిక ధరలు ఇప్పించడమే. దీంతో యార్డులో లావాదేవీలు బాగా జరుగుతూ సెస్ రూపంలో ఆదాయం పెరిగింది. అలాగే చెక్పోస్టులు, మార్కెట్కు అవతల జరిగే ప్రతి వ్యవసాయ ఉత్పత్తులపై 1 శాతం సెస్ వచ్చేందుకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండడంతో ఆదాయం పెరుగుతున్నది. రాబోయే రోజుల్లో మరింత ఆదాయం పెంచేందుకు కృషి చేస్తాం.
-ఫసియొద్దీన్, మార్కెట్ సెక్రటరీ, సూర్యాపేట మార్కెట్
రైతులకు సకల సౌకర్యాలు కల్పిస్తాం
గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఇప్పటికే అంచనాలకు మించి ఆదాయం వస్తుంది. మార్కెట్కు పెరుగుతున్న ఆదాయంతో యార్డులో రైతుల సౌకర్యార్థం సకల సౌకర్యాలు కల్పిస్తాం. రైతులు బాగుంటేనే గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం బాగుపడుతుందని భావించిన సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. తదనుగుణంగా యార్డుకు రైతులు తెచ్చే పంటలకు మంచి ధరలు ఇప్పించడంతోపాటు వారికి అన్ని వసతులు కల్పిస్తున్నాం.
-ఉప్పల లలితాఆనంద్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్, సూర్యాపేట