కట్టంగూర్(నకిరేకల్), ఫిబ్రవరి 6 : ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. నకిరేకల్ పట్టణ శివారులో బైపాస్ వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది. ఖమ్మం జిల్లా మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో హైదరాబాద్కు వెళ్తున్నది. పట్టణ శివారులో బైపాస్ నుంచి జాతీయ రహదారిపైకి బస్సు యూటర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ.. బస్సు ముందు భాగాన్ని ఢీకొట్టింది. దాంతో బస్సులోని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 వాహనంలో నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
మిగిలిన వారిని మరో బస్సులో గమ్యస్థానానికి పంపారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు. లారీ వేగాన్ని గుర్తించి బస్సు డ్రైవర్ అప్రమత్తమై సకాలంలో వేగాన్ని నియంత్రించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు మధ్య భాగంలో లారీ ఢీకొట్టి ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.