రామన్నపేట, ఫిబ్రవరి 6 : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలన సాగుతున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలుకు పైలెట్ విలేజ్గా ఎంపికైన మండలంలోని కుంకుడుపాముల గ్రామంలో ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పేదరికంలో మగ్గుతున్న దళితుల ఆర్థికాభివృద్ధే దళితబంధు లక్ష్యమన్నారు.
ముఖ్యమంత్రి అఖిలపక్ష నాయకులతో చర్చించి దళితబంధు పథకం ప్రకటిస్తే జీర్ణించుకోలేని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని సూచించారు. ప్రతి దళిత కుటుంబానికీ విడతల వారీగా దళితబంధు పథకం అందిస్తామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్రామంలో 38మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశామని, మార్చిలోగా గ్రౌండింగ్ పూర్తి అవుతుందని తెలిపారు. లబ్ధిదారులు దళితబంధును సద్వినియోగం చేసుకుని ప్రభుత్వానికి అండగా నిలువాలని కోరారు. గ్రామంలో గొర్రెల యూనిట్లు అందించడంతో పాటు, రూ.25లక్షలతో సీసీ రోడ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
అంతకుముందు గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. సర్పంచ్ బొక్క యాదిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా షెడ్యుల్డ్ కులాల అధికారి జైపాల్రెడ్డి, తాసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ జలేందర్రెడ్డి, ఎంపీటీసీలు ఏనుగు పుష్పావెంకట్రెడ్డి, ఎండీ.ఆమేర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి, కార్యదర్శి పోచబోయిన మల్లేశం, బందెల రాములు, బొక్క మాధవరెడ్డి, కంభంపాటి శ్రీనివాస్, ఉపసర్పంచ్ పద్మ, పరమేశ్ పాల్గొన్నారు.