మోత్కూరు, సెప్టెంబర్ 2 : గణేశ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం వినాయక మండపాల వద్ద ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, ప్రధాన రోడ్డు వెంట, గడిబజార్, అంగడి బజార్, వెంకటేశ్వర కాలనీ, మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం, ధర్మాపురం, కొండాపురం, జామచెట్లబావి, కొండగడప, బుజిలాపురంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో వినాయక మండపాల్లో విగ్రహాలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం పులిహోర, ప్రసాదం పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి పూజల్లో పాల్గొన్నారు.
చౌటుప్పల్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకదంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల విఘ్నాలు తొలుగుతాయన్నారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, ఆర్యవైశ్య సంఘం మండలాధ్యక్షుడు కాంశెట్టి చంద్రశేఖర్, నాయకులు మంచికంటి భాస్కర్, సోమవరపు సత్తయ్య, నాంపల్లి రమేశ్, ఉప్పుల కృష్ణ పాల్గొన్నారు.
భువనగిరి సిటీ : పట్టణంలోని వినాయక మండపాల వద్ద నిర్వాహకులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. హీరేకార్ రాంచందర్, ధనేశ్, శ్రీను, మహేశ్, సాయి, నాగరాజు పాల్గొన్నారు.