అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ రాఖీ. ఇంటింటా ఆనందాలు నింపే రక్షాబంధన్ను నేడు జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకోనున్నారు. సోదరులకు రాఖీ కట్టేందుకు ఆడబిడ్డలు సిద్ధమవుతున్నారు. మార్కెట్లో రకరకాల రాఖీలు అందుబాటులోకి రాగా గురువారం కొనుగోళ్ల సందడి కనిపించింది. నోరు తీపి చేసేందుకు స్వీట్ల అమ్మకాలూ జోరుగా సాగాయి. ఉమ్మడి జిల్లా ప్రజలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువుల మధ్య అన్యోన్యతను ఇనుమడింపజేసే రక్షాబంధన్ను సంతోషంగా జరుపుకోవాలని, ఆడబిడ్డల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని వారు పేర్కొన్నారు.
రామగిరి, ఆగస్టు 10 : అన్నాచెల్లెల ఆత్మీయ అనురాగాల వేడుక రాఖీ. తరాలు మారిన తరగని తారతమ్యం లేకుండా జరుపుకునే పండుగ రక్షాబంధన్. ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజు ఈ పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది శుక్రవారం జరుపుకోనున్నారు. సోదరీమణులు అన్న, తమ్ముడి నోరు తీపి చేసి జీవితాంతం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తారు.
నల్లగొండ : ప్రజలు రాఖీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి జిల్లా ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధం, అప్యాయతకు ప్రతి రూపమే రక్షాబంధన్ అన్నారు. కరోనా కారణంగా రెండేండ్లుగా రాఖీ పండుగ పెద్దగా జరుపుకోలేక పోయారని ఈ సారి సంతోషంగా ఇంటిల్లి పాది ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
సూర్యాపేట టౌన్: రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొనసాగుతున్న జనరంజకమైన పాలనలో ఆడబిడ్డలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మనదన్నారు. అలాంటి ప్రభుత్వంలో ఆనందోత్సాహా లతో రక్షాబంధన్ జరుపుకుంటున్న సోదర సోదరీమణులకు శుభాభినందనలు తెలిపారు. కరోనా మహమ్మారితో రెండేండ్లుగా ఇంటికే పరిమితమై వేడుకలు జరుపుకున్న ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛా యుతంగా జరుపుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
రాఖీ పండుగను పురస్కరించుకుని గురువారం సూర్యాపేట, నల్లగొండ పట్టణాల్లో రాఖీ సెంటర్ల్లు, స్వీట్ షాపులు సందడిగా మారాయి. రెండేండ్ల తర్వాత స్టాల్స్లో విక్రయాలు పెరిగాయి. ఈ ఏడాది బంగారం, వెండి, రాళ్లు పొదిగిన రాఖీలకు గిరాకీ బాగా ఉందని వ్యాపారులు పేర్కొన్నారు. ఇక పేర్లతో కూడిన రాఖీలతో పాటు ఫొటోలతో కూడిన రాఖీలు సైతం ప్రత్యేకంగా తయారు చేయించుకుంటున్నారు. సోదరులపై ప్రేమ తెలిసేలా అందమైన రాఖీలను ప్రత్యేకంగా రూపొందించుకుంటున్న వారి సంఖ్యకూడా పెరిగింది.