పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశభక్తిని పెంపొందిస్తూ, స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించేలా కార్యక్రమాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఆ మేరకు వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. శనివారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల ప్రకారం సోమవారం నుంచి 15 రోజుల పాటు ఉత్సవాలకు సిద్ధం కావాలని ఆదేశించారు. మంగళవారం నుంచి ఈ నెల 21 వరకు రోజువారీ షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తూ, అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలని దిశానిర్ధేశం చేశారు. ఇంటింటా జాతీయ జెండాలు ఎగరవేస్తూ సమరయోధుల త్యాగాల చరిత్రను స్మరిస్తూ స్వాతంత్రోద్యమ స్పూర్తిని ఎలుగెత్తి చాటాలని ఆకాంక్షించారు.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల ప్రకారం ఈ నెల 8నుంచి 15 రోజుల పాటు ఉత్సవాలకు సిద్ధం కావాలన్నారు. జిల్లాలో 9నుంచి 21వ తేదీ వరకు రోజూవారీ షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తూ, అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వాములను చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఇంటింటా జాతీయ జెండాలు ఎగురవేస్తూ సమరయోధుల త్యాగాల చరిత్రను స్మరిస్తూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ఎలుగెత్తి చాటాలే ఉత్సవాలను నిర్వహణ జరగాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర వజ్రోత్సవాల ప్రశస్త్యాన్ని ప్రస్తుత తరానికి అందించేందుకు ప్రతిఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్రోద్యమ పోరాట ప్రాశస్త్యం, పోరాటయోధుల స్ఫూర్తి, అమరవీరుల అమరత్వం మూడో తరానికి అంతంత మాత్రమే తెలుసన్నారు. ప్రస్తుత తరాలకు స్వాతంత్య్ర ఉద్యమ ఫలాల గురించి తెలిపేందుకు ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నారు. 1947కు ముందు పరిస్థితులు వివరిస్తూ అహింసాయుత మార్గంలో స్వాతంత్య్రాన్ని సాధించిన మహాత్మాగాంధీ సంకల్పాన్ని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.
పోరాటాల్లో అహింసాయుత పోరాటం ఎంతో కఠినమైనదని, అలాంటి పోరాటంతో ఉద్యమాన్ని మహాత్మాగాంధీ విజయ తీరాలకు చేర్చారని కొనియాడారు. అలాంటి మహాత్ముడి గురించి ప్రస్తుత తరానికి తప్పుడు సందేశాన్ని ఇచ్చే విధంగా అపోహలు సృష్టిస్తుండడంపై ఆవేదన వ్యక్తంచేశారు. అటువంటి అపోహలను పటాపంచలు చేయడంతో పాటు దేశానికి స్వాతంత్రం సిద్ధించేందుకు నాటి యోధులు పడిన శ్రమను, ఆ ఫలాల అనుభవిస్తున్న నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ ప్రచార మాధ్యమాలు లేని రోజుల్లోనే యావత్ భారతావనిని ఏకధాటిపైకి తెచ్చిన చరిత్రను అందరికీ తెలియజెప్పాలన్నారు.
15రోజుల పాటు ఉత్సవాలు
ఈ నెల 8నుంచి లాంఛనంగా ప్రారంభమయ్యే ఉత్సవాలు 15 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి మీద రెపరెపలాడే తిరంగ జెండా రూపంలో వర్తమానానికి స్వాతంత్ర ఉద్యమ చరిత్ర బోధపడేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ నెల 8న హైదరాబాద్లో లాంఛనంగా వేడుకలు ఆరంభం అవుతాయని, 9నుంచి జిల్లాల్లో వేడుకలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్లు ఎలిమినేటి సందీప్రెడ్డి, గుజ్జ దీపికాయుగేంధర్రావు, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, పైళ్ల శేఖర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, మున్సిపల్ చైర్మన్లు మందడి సైదిరెడ్డి, పెరుమాండ్ల అన్నపూర్ణ, నల్లగొండ, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు రాహుల్శర్మ, పమేలా సత్పతి, సూర్యాపేట అదనపు కలెక్టర్ మోహన్రావు, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, యాదాద్రి డీసీపీ నారాయణరెడ్డితో పాటు మూడు జిల్లాలకు సంబంధించిన వజ్రోత్సవ కమిటీ సభ్యులు, అధికారులు, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు.
జయశంకర్ సర్ స్ఫూర్తితో రాష్ట్ర సాధన
మంత్రి జగదీశ్రెడ్డి ఘన నివాళి
నల్లగొండ, ఆగస్టు 6 : దివంగత ఆచార్య జయశంకర్ సర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యపడిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా కలెక్టరేట్లోని ఉదయాదిత్యభవన్లో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సాగిన సాహసోపేత పోరాటానికి అంకురార్పణ చుట్టింది జయశంకర్ సారే అన్నారు. ఆరు దశాబ్దాలుగా తెలంగాణ సాదక బాధకాలను సోదాహరణంగా వివరించిన మహనీయుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. అటువంటి మహనీయుడి కలల సాకారానికి ప్రణాళికలు రూపొందించి ప్రణాళికాబద్ధంగా పాలన సాగిస్తున్న నేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ కోటి రెడ్డి, జడ్పీ చైర్మన్లు గుజ్జ దీపికా యుగంధర్రావు, ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, నల్లగొండ, యాదాద్రి కలెక్టర్లు రాహుల్ శర్మ, పమేలా సత్పతి, ఎస్పీ రెమారాజేశ్వరి, డీసీపీ నారాయణరెడ్డి పాల్గొన్నారు.
సాగర్ను సందర్శించిన ఇంజినీర్ల బృందం
నందికొండ, ఆగస్టు 6 : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇంజినీర్ల బృందం అంతర్జాతీయ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్ను శనివారం సందర్శించింది. 1982-1986 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి వివిధ రంగాల్లో స్థిరపడిన ఇంజనీర్ల బృందం 35ఏండ్ల తర్వాత నాగార్జునసాగర్లో కలుసుకున్నారు. టూరిజం లాంచీలో నాగార్జునకొండకు వెళ్లి పురావస్తు మ్యూజి యం, అలనాటి బుద్ధుడి చారిత్రక ఆనవాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలాకాలం తర్వాత చారిత్రక నేపథ్యమున్న నాగార్జునసాగర్లో అందరం కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆదివారం నాగార్జునసాగర్ డ్యాం, బుద్ధవనాన్ని సందర్శిస్తామని తెలిపారు. వీరితో ఎన్నెస్పీ డీఈ పరమేశ్, టూరిజం గైడ్ సత్యనారాయణ ఉన్నారు.
జిల్లాల్లో ఉత్సవాల షెడ్యూల్ ఇలా
ఈ నెల 9న ఇంటింటికి
జాతీయ జెండాల పంపిణీ
10న వన మహోత్సవం
11న ఫ్రీడమ్ రన్
12న జాతీయ సమైక్యతా రక్షా బంధన్
13న గ్రామాల్లో
మూడు రంగుల బెలూన్ల ఎగురవేత
14న జానపద కళల ప్రదర్శన
15న ఘనంగా
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
16న సామూహిక ఆలాపన
17న రక్తదాన శిబిరాలు
18న జిల్లా స్థాయిలో ఉద్యోగులకు,
యువతకు క్రీడా పోటీలు
19న వృద్ధులు, అనాధ ఆశ్రమాల్లో
సేవా కార్యక్రమాలు
20న రంగోలి
21న వజ్రోత్సవాలపై
స్థానిక సంస్థల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణ