కోదాడ రూరల్, మే 11 : రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి 10రోజుల పాటు విధించిన లాక్డౌన్కు ప్రజలంతా సహకరించాలని ఎంపీపీ చింతా కవితారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఉదయం 6 నుంచి 10గంటల వరకు ఉండే సడలింపు సమయంలోనే ప్రజలు బయటకు వెళ్లాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించి లాక్డౌన్ను విజయవంతం చేయాలని కోరారు.
14రోజులుగా స్వచ్ఛంద లాక్డౌన్
మేళ్లచెర్వు : కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం బుధవారం నుంచి లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. ఉదయం 6 నుంచి 10గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. కాగా, మేళ్లచెర్వులో గత నెల 28 నుంచి స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. పంచాయతీ తీర్మానం మేరకు 14 రోజులుగా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచుతున్నారు. స్వచ్ఛంద లాక్డౌన్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామంలో ప్రచారం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మాస్క్ ధరించి బయటకు రావాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1000 జరిమానా విధిస్తున్నారు.
లాక్డౌన్తో తగ్గుతున్న కేసులు
మునగాల : మండల కేంద్రంతోపాటు నారాయణగూడెం, ఆకుపాములలో స్వచ్ఛంద లాక్డాన్ నిర్వహిస్తున్నారు. వ్యాపారులు, ప్రజలు అందుకు సహకరిస్తున్నారు. వ్యాపారులు దుకాణాలు మూసివేస్తుండగా, ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. దీంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
లాక్డౌన్ను ఉల్లంఘిస్తే చర్యలు : ఎస్ఐ
నేరేడుచర : కరోనా వైరస్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని ఎస్ఐ యాదవేంద్రరెడ్డి హెచ్చరించారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా ఉదయం 6నుంచి 10గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచాలన్నారు.