నల్లగొండ, జనవరి 10 : దావానంలా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. కరోనాను నియంత్రించడంలో కీలకంగా మారిన వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్తున్నది. ఇప్పటికే రెండు డోసులు టీకాలు వేసుకున్న వారికి సోమవారం ప్రికాషనరీ డోస్ ప్రారంభించింది. తొలుత హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఇస్తున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలి రోజు 1,403 మందికి బూస్టర్ డోస్ ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు టీనేజర్ల వ్యాక్సినేషన్ కోసం 88 కేంద్రాలు కొనసాగినట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫ్రంట్లైన్ వారియర్స్ 60,300 మంది ఉండగా అందులో హెల్త్ కేర్ వర్కర్లు, పోలీసులు సుమారు 18,000 మంది ఉన్నారు. ఇక 60 ఏండ్లు పైబడి ఆయా సమస్యలతో బాధపడేవారు మరో 42,300 దాకా ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో ఆయా వర్గాలకు తొలి రోజు అవకాశం ఇవ్వకుండా మొదటగా 60 ఏండ్లు పైబడిన వారికే ఇచ్చారు. వారికి పూర్తి స్థాయిలో అవగాహన లేని కారణంగా వ్యాక్సిన్ కేంద్రాలకు రాలేదు. అయితే హెల్త్ వర్కర్లతోపాటు అంగన్ వాడీలు, పోలీసులు, మున్సిపల్ కార్మికులు టీకా వేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించిన నేపథ్యంలో మంగళవారం నుంచి ప్రికాషనరీ డోసులు పెరుగనున్నాయి. ఇదిలా ఉండగా సంక్రాంతి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు ఇండ్లకు వచ్చినందున టీనేజర్ల వ్యాక్సినేషన్ స్పీడప్ అయ్యింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6.80 లక్షల మంది టీనేజర్లు ఉండగా అందులో ఇప్పటి వరకు 65 వేల మంది వరకు వ్యాక్సిన్ వేయించుకున్నారు.