వానలకు అనుగుణంగా అదును మీద సాగుకు రైతులు అడుగులు వేస్తున్నారు. కొద్దిరోజులుగా కరుస్తున్న వర్షాలతో మెట్ట పంటల వైపు ఉపక్రమించారు. నారుమళ్లనూ సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు సీజన్కు సరిపడా విత్తనాలు,ఎరువులను ప్రభుత్వం ఇప్పటికే అందుబాటులో ఉంచింది. అవసరానికి అనుగుణంగా జిల్లాలకు పంపిస్తూ సరఫరా చేస్తున్నారు. ఇదే సమయంలో సీజన్ ఆరంభంలో రైతులకు పంట పెట్టుబడి సమస్య లేకుండా రైతు బంధు నగదును ఖాతాలకు చేరుస్తున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూడెకరాల్లోపు ఉన్నవారికి ఇప్పటికే జమ చేసింది. వరుసగా తొమ్మిదోసారి పెట్టుబడి సాయం ద్వారా సర్కారు వెన్నుదన్నుగా నిలువడంతో రైతులు ఉత్సాహంగా సాగు బాటలో సాగుతున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిస్తే మెట్ట పంటలు వేయడం త్వరలోనే పూర్తవుతుందని వ్యవసాయ శాఖ యంత్రాంగం చెప్తున్నది. ఈ సీజన్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10.75లక్షల ఎకరాల్లో వరి, 10.13లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానున్నట్లు భావిస్తున్నది.
నల్లగొండ ప్రతినిధి, జూలై 2 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వానకాలం సీజన్లో రైతులు పెద్దఎత్తున పత్తి, వరి సాగుకు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పత్తి సాగు చేసే జిల్లాగా నల్లగొండ ఇప్పటికే ప్రసిద్ధి చెందింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే పత్తి సాగును ప్రారంభించారు. ఈ సీజన్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10.75లక్షల ఎకరాల్లో వరి, 10.13 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ ఇదివరకే అంచనాలు రూపొందించింది. అందుకు అనుగుణంగానే విత్తనాలు, ఎరువుల అవసరాలను గుర్తించి అందుబాటులో ఉంచింది. పంటలకు అవసరమైన మేర ఎరువులను దశలవారీగా క్షేత్రస్థాయిలో రైతులకు సరఫరా చేస్తున్నది. వాస్తవంగా ఈ సీజన్లో జూన్ మూడో వారం వరకు కూడా సరైన వర్షాలు కురువలేదు. చివరి వారంలో కురిసిన వర్షాలతోనే రైతులు సాగుకు ఉపక్రమించారు.
2,94,511 ఎకరాల్లో పత్తి
గతేడాదితో పోలిస్తే ఈ సారి పంటల సాగు కొంత ఆలస్యమైనట్లే. అయితే ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో పంటల సాగును పరిశీలిస్తే ఇంకా పూర్తిస్థాయిలో సాగు కావాల్సి ఉంది. నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు పత్తి పంట అధికంగా సాగైంది. మొత్తం 2,94,511 ఎకరాల్లో పత్తి సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఇంకా మూడున్నర లక్షల ఎకరాల వరకు పత్తిసాగు కావచ్చని అంచనా. దాంతో పాటు వరినాట్లకు ముందు తరి భూముల్లో సాగు చేసే పచ్చిరొట్ట 12,208 ఎకరాల్లో సాగైంది. కంది 700 ఎకరాల్లో, పెసర 42 ఎకరాల్లో, జొన్న 53, సజ్జ 20 ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. ఇవి కాకుండా వరినార్లు కూడా మెట్ట ప్రాంతాల్లో సిద్ధమవుతున్నాయి. నాగార్జునసాగర్ ఆయకట్టులో మాత్రం ఈ నెల మూడో వారం నుంచి నారుమళ్లు సిద్ధం చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల తర్వాతనే ఒకే సారి నారుమళ్లు, నాట్లకు రైతులు సిద్ధమవుతుంటారు.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 36,745 ఎకరాల్లో పత్తి సాగైంది. కంది 661, పెసర 162, వేరుశనగ 270, వరినార్లు 11,622 ఎకరాల్లో, జీలుగు 6,803 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇక్కడ ఇంకా పత్తి, కంది పంటల సాగు పెరుగాల్సి ఉంది. ఎస్ఆర్ఎస్పీ ద్వారా కాళేశ్వరం జలాలు విడుదలైతే ఆ ప్రాంతంతో పాటు బోర్లు బావుల కింద కూడా వరినాట్లు ఊపందుకోనున్నాయి.
యాదాద్రి జిల్లాలో..
యాదాద్రి జిల్లాలో అత్యధికంగా పత్తి 40,930 ఎకరాల్లో, కంది 1,147 ఎకరాల్లో సాగైంది. పెసర, జొన్న, సజ్జ వంటి మెట్ట పంటలు పదుల ఎకరాల్లోనే సాగయ్యాయి. 69,888 ఎకరాలకు సంబంధించిన నారుమళ్లు సిద్ధం కాగా ఇప్పటికే 4,173 ఎకరాల్లో వరి నాట్లు కూడా పూర్తయినట్లు అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో అధిక సాంద్రత పత్తి సాగుపై వ్యవసాయశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. దాని వల్ల అధిక దిగుబడితో పాటు కూలీల ఖర్చు భారీగా తగ్గుతుంది. రానున్న కాలంలో ఇతర దేశాల్లో మాదిరిగా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పత్తి దిగుబడులను సాధించేలా రైతులను సిద్ధం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నది. సరైన వర్షాలు కురిస్తే మరో రెండు వారాల్లోనే వరి మినహా మిగతా పంటల సాగు పూర్తికానున్నది. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు, సాగర్ ద్వారా కృష్ణాజలాలు కూడా విడుదలైతే వరి సాగు ఊపందుకోనున్నది.
రైతుబంధు సాయం
2018 వానకాలం సీజన్ నుంచి నేటి వరకు సీఎం కేసీఆర్ రైతులను సాగు విషయంలో వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా సీజన్ ఆరంభంలో పెట్టుబడుల సమస్య రాకుండా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారు. కులం, మతం, ధనిక, పేద తారతమ్యం లేకుండా పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతునూ సాగు వైపు మళ్లించేలా పథకాన్ని రూపొందించారు. దీని ద్వారా ఎకరానికి రూ.5వేల చొప్పున రెండు సీజన్లలో అందిస్తున్నారు. దాంతో దాదాపు ఎకరం సాగుకయ్యే మెజార్టీ ఖర్చు ప్రభుత్వమే ఇస్తున్నది. ఫలితంగా దీంతో ఎంతో మంది రైతులు ధైర్యంగా సాగుబడిలో ముందుకు సాగుతున్నారు. వానకాలం సీజన్కు సంబంధించి గత నెల 28 నుంచి రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు మూడెకరాల లోపు ఉన్న రైతులకు డబ్బులు జమఅయ్యాయి. మిగతా వారికి కూడా దశలవారీగా అందజేసేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సీజన్లో ఉమ్మడి జిల్లాకు రూ.1,236 కోట్లు అందించాలని అంచనా వేశారు. అంతకు ముందు ఎనిమిది సీజన్లలో కలిపి రూ.7,930 కోట్లను ప్రభుత్వం రైతులకు నేరుగా అందించింది. ఈ సీజన్లోనూ త్వరలోనే రైతులందరికీ రైతుబంధు డబ్బులు జమ చేయనున్నది. ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల ప్రోత్సాహం లభిస్తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. వరుణుడు పూర్తి స్థాయిలో కరుణిస్తే అనుకున్న విధంగా పంటలన్నీ సాగుకానున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వర్షాలు నిరాశాజనకంగానే ఉన్నాయి.
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
కోదాడ రూరల్, జూలై 2 : వానకాలం సీజన్కు సంబంధించిన రైతుబంధు విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం కోదాడ మండలం నల్లబండగూడెం శివారులో రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్రోడ్డు వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులతో కలిసి ఎంపీపీ చింతా కవితారెడ్డి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా రైతుబంధును అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శెట్టి సురేశ్నాయుడు, రైతుబంధుసమితి మండలాధ్యక్షుడు అనంత సైదయ్య, పీఏసీఎస్ చైర్మన్ ముత్తవరపు రమేశ్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు గడిపూడి శ్రీకాంత్, యూత్ అధ్యక్షుడు అన్నెం వెంకట్రెడ్డి, నాయకులు సాధినేని అప్పారావు, పొట్ట కిరణ్, ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు కలకొండ బాలకృష్ణ, ధరావత్ బాజ్జి, మల్లెల పుల్లయ్య, బ్రహ్మయ్య, యరమాల బెంజిమెన్, ఎంపీటీసీ క్రాంతికుమార్, పాముల మస్తాన్, దొంగల లక్ష్మీనారాయణ, శ్రీనివాస్యాదవ్, కంచుగంటి గోపి, దాసరి వీరబాబు, బూరేల కరుణాకర్,
బట్టు కోటేశ్వర్రావు, నబీ, కోళ్లురి రామారావు పాల్గొన్నారు.