రామగిరి, జూలై 2 : జిల్లా కేంద్రంలో ఈనెల 5న ఇస్కాన్ ఆధ్వర్యంలో ‘జగన్నాథ రథయాత్ర’ను నిర్వహిస్తున్నట్లు నల్లగొండ మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్ తెలిపారు. శనివారం నల్లగొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇస్కాన్ సంస్థ కూకట్పల్లి అధ్యక్షుడు మహాశృంగదాస్తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను నేటి యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు శాఖ అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు.
జిల్లా కేంద్రంలోని అన్ని ఆలయాల పాలకమండలి కమిటీ చైర్మన్లు, సభ్యులు, భక్తులు విధిగా పాల్గొనాలని కోరారు. ఇస్కాన్ అధ్యక్షుడు మహాశృంగదాస్ మాట్లాడుతూ 21 దేశాలకు చెందిన ఇస్కాన్ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. లక్ష్మీగార్డెన్స్ నుంచి హైదరాబాద్ రోడ్డు వీటీకాలనీ, ఎన్టీఆర్ విగ్రహం, శివాజీనగర్, బస్టాండ్, గడియారం సెంటర్ మీదుగా రామగిరిలోని సీతారామచంద్రస్వామి ఆలయం వరకు యాత్ర కొనసాగుతుందన్నారు. అనంతరం ఇస్కాన్ ప్రతినిధులు ఆలపించిన భజన గీతాలు అలరించాయి. సమావేశంలో కౌన్సిలర్లు వట్టిపల్లి శ్రీనివాస్, యామ కవితాదాయకర్, ఆలయాల చైర్మన్లు గంట్ల అనంతరెడ్డి, చకిలం అనిల్కుమార్, నేలపట్ల రమేశ్, తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ భువనగిరి దేవేందర్, నాయకురాలు మామిడి పద్మ, వికాస తరంగిని నిర్వహకులు పాల్గొన్నారు.