నీలగిరి, జూన్ 26 : జూలై 1న నిర్వహించే గ్రూప్-4 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఎస్పీ అపూర్వరావుతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 53,123 మంది అభ్యర్థులు గ్రూప్-4 పరీక్షలను రాస్తున్నందున వారికి కోసం 188 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లోకి ఐడీ కార్డ్స్, హాల్టిక్కెట్లు లేకుండా అభ్యర్థులను అనుమతించవద్దని సూచించారు.
పరీక్ష కేంద్రాలను చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులు ముందుగా సందర్శించి తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫ్యాన్లు, ఫర్నిచర్, సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించాలన్నారు. పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిన నిర్వహించనున్నందున అభ్యర్థులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. పరీక్ష సమయం ముగిసే 15 నిమిషాల ముందు అభ్యర్థి ఎడమ వేలిముద్ర నామినల్ రోల్పై తీసుకోవాలని సూచించారు.
దివ్యాంగులకు భవనంలోని కింది ఫ్లోర్లో ఉన్న గదులను కేటాయించాలన్నారు. ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నందున సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, అభ్యర్థులను తనిఖీ చేసి పరీక్ష కేంద్రాల్లోకి పంపాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ ప్రసాద్రావు, ఆర్డీఓలు చెన్నయ్య, గోపిరాంనాయక్, డీఎస్పీలు, రూట్ ఆఫీసర్లు, లైజన్ అధికారులు పాల్గొన్నారు.