జిల్లావ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ప్రతి ఇంటికీ జాతీయ పతాకాన్ని అందించే కార్యక్రమం రెండోరోజూ ముమ్మరంగా కొనసాగింది. షెడ్యూల్లో భాగంగా బుధవారం వన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లాలో 2.96లక్షల మొక్కలు నాటుకున్నాయి. 71 చోట్ల ఫ్రీడమ్ పార్కులు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమాలను ముందుండి నడిపించారు. పలుచోట్ల విద్యార్థుల కోసం థియేటర్లలో గాంధీ చలన చిత్రాన్ని ప్రదర్శించారు. గురువారం ఉదయం అంతటా ఫ్రీడమ్ రన్ ఉండగా, విజయవంతం చేసేందుకు పోలీసు విభాగం ప్రత్యేకంగా కృషి చేస్తున్నది.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఎక్కడా చూసిన వజ్రోత్సవ శోభనే సంతరించుకుంది. ప్రభుత్వ కార్యాలయాలను ప్రత్యేకంగా లైటింగ్, తోరణాలతో ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల జాతీయ జెండాలను ఎగరవేశారు. వాహనాలకు సైతం జాతీయ పతకాలను ధరింప చేస్తున్నారు. బుధవారం జిల్లా అంతటా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో జాతీయ జెండా పంపిణీలో పాల్గొని సామాన్యులను సైతం ఇందులో భాగస్వాములు అయ్యేలా ఉత్సాహాపరిచారు. నల్లగొండలోని 37వ వార్డులో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఇంటింటికి జెండాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్క్ను ప్రారంభి మొక్కలు నాటి వనమహోత్సవంలో పాల్గొన్నారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు విద్యార్ధులతో కలిసి థియేటర్లో గాంధీ సినిమాను వీక్షించారు. అనంతరం పట్టణంలోని శాంతినగర్, ఇందిరానగర్ కాలనీతో పాటు రూరల్లోని వెంకటాద్రిపాలెంలో జాతీయ జెండాల పంపిణీలో పాల్గొన్నారు. ఫ్రీడం పార్క్లను ప్రారంభిస్తూ మొక్కలు నాటి అందరూ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వజ్రోత్సవ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్క్ను ప్రారంభిస్తూ మొక్కలు నాటారు. అనంతరం ఇంటింటికి జాతీయ పతకాల పంపిణీ చేశారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో ఎమ్మెల్యే నోముల భగత్ ఫ్రీడం పార్క్ను ప్రారంభి 75 సంవత్సరాలను చాటిచెప్పేలా అంకెల ఆకారంలో మొక్కలు నాటారు. ఇంటింటికి జెండాల పంపిణీలో పాల్గొని ప్రతీ ఇంటి మీద జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. తిర్మలగిరిసాగర్లో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి జాతీయ జెండాల పంపిణీని ప్రారంభించారు. అనంతరం హాలియాలోని ఫ్రీడం పార్క్లో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ వజ్రోత్సవ ఉత్సవాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక శ్రీనివాస థియేటర్లో విద్యార్ధుల కోసం ప్రత్యేక గాంధీ సినిమా చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం అల్వాలపురం, ఐఏఎస్ కాలనీల్లో జాతీయ జెండాలను పంపిణీ చేసి ఫ్రీడం పార్క్ల్లో మొక్కలు నాటారు. నియోజకవర్గం అంతటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
వజ్రోత్సవా సందర్భంగా ప్రతీ ఇంటిపై ఈ నెల 15వ తేదీన జాతీయ జెండాలు ఎగరవేసేలా ప్రణాళిక రూపొందించారు. అందుకోసం ప్రతీ ఇంటికి ప్రభుత్వమే ఉచితంగా జాతీయ జెండాను అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 9.52లక్షల త్రివర్ణ పతాకాలు అవసరం అవుతాయని అంచనా వేయగా బుధవారం నాటికి 4.23 లక్షలు చేరాయి. వీటిల్లో నుంచి ఇప్పటికే 2.61లక్షల ఇండ్లకు పతాకాలను చేరవేశారు. ఇక బుధవారం వనమహోత్సవం సందర్భంగా 2.96లక్షల మొక్కలు నాటారు. వీటితో పాటు 920 ఫ్రీడం పార్క్లకు శ్రీకారం చుట్టారు.
వజ్రోత్సవాల్లో భాగంగా నేడు ఉమ్మడి జిల్లా అంతటా ఫ్రీడం రన్కు విస్త్రతంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడే 2కె రన్ నిర్వహణ కోసం ఇప్పటికే స్థానికులను, ముఖ్యంగా యువతను, క్రీడాకారులను ఇందులో భాగస్వాములయ్యేలా కార్యచరణ రూపొందించారు. పోలీసు యంత్రాంగం ఈ రన్ నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పోలీసు స్టేషన్ల వారీగా నేటి రన్ ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది కూడా రూట్ మ్యాప్ను ప్రకటించింది. దీంతో పాటు సోషల్మీడియాలోనూ విస్త్రతంగా ప్రచారం కల్పిస్తూ ఇందులో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యేలా జిల్లా అధికారయంత్రాంగాలు చర్యలు చేపట్టాయి.