నల్లగొండ, ఆగస్టు 10 : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం బుధవారం వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా లక్ష్యానికి మించి మొక్కలు నాటారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 237 ఫ్రీడం పార్కులు ఏర్పాటు చేయగా ఆయా పార్కుల్లో 750 మొక్కల చొప్పున మొత్తం 1.77లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఉమ్మడి జిల్లాలోని 1740 గ్రామ పంచాయతీల్లో 216 పార్కులకు స్థలాలను గుర్తించిన అధికారులు, 19 మున్సిపాలిటీల్లోనూ ఒక్కొక్కటి చొప్పున ఫ్రీడం పార్కులు ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. స్థానిక ప్రజాప్రతినిదుల భాగస్వామ్యంతో వనమహోత్సవం అంచనాలకు మించి విజయవంతమైంది. ఇదిలా ఉండగా నల్లగొండలోని నాగార్జునసాగర్లో అందుబాటులో ఉన్న 20వేల ఎకరాల్లోనూ ఫ్రీడం పార్కును ఏర్పాటు చేసి మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోని 71 మండలాల్లో 1740 గ్రామ పంచాయతీలు ఉండగా 216 ఫ్రీడం పార్కులను గుర్తించిన రెవెన్యూ యంత్రాగం ప్రతి పార్కుకు కనీసం అర ఎకరం ప్రభుత్వ భూమిని గుర్తించారు. ప్రతి పార్కులో 750 మొక్కల చొప్పున మొత్తంగా 1,63,250 మొక్కలు నాటాలని ప్రణాళికలు రూపొందించి ముందస్తుగానే గుంటలు తీసిపెట్టారు.
అదే విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 19 మున్సిపాలిటీల్లో 14,250 మొక్కలతో కలిపి మొత్తం 1,56,975 మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న అధికార యంత్రాంగం బుధవారం అంతకుమించి నాటారు. ఫ్రీడం పార్కుల్లో 750 మొక్కలతో పాటు ఫ్రీడం పార్కులు గుర్తించని చోట 75మొక్కల చొప్పున నాటటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్క రోజే గ్రామ పంచాయితీల్లో 2,96,377, 19 మున్సిపాలిటీల్లో 22,372 మొక్కలతో కలిపి 3,18,749 మొక్కలు నాటారు.
నల్లగొండలోని నాగార్జున సాగర్లో 20వేల ఎకరాల అటవీ భూమి అందుబాటులో ఉండడంతో అక్కడ మెగా ఫ్రీడం పార్కును ఏర్పాటు చేయటానికి జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. వజ్రోత్సవాల అనంతరం తర్వాత మెగా ఫ్రీడం పార్కులో 75వేల మొక్కలు నాటనున్నారు.
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవం చేపట్టి మొక్కలు నాటాం. నల్లగొండలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా భూమి లభ్యతను బట్టి 93 ఫ్రీడం పార్కులు ఏర్పాటు చేశాం. వీటిలో 750 మొక్కల చొప్పున, మిగిలిన గ్రామాల్లోనూ 75 మొక్కల చొప్పున మొత్తం 1.09లక్షల మొక్కలు నాటాం. ముందస్తుగానే ఎన్ఆర్ఈజీఎస్ కింద గుంటలు తీయడంతో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో మొక్కలు నాటగలిగాం.
– విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, నల్లగొండ