పెద్దవూర, ఏప్రిల్ 1 : ‘నాగార్జునసాగర్ ప్రజాస్వామ్య పరిపాలన మొదలైంది నోముల నర్సింహయ్య ఎమ్మెల్యే అయిన తర్వాతే. జానారెడ్డి రాచరిక పాలనకు నియోజకవర్గ ప్రజలు 2018లోనే చరమగీతం పాడారు’ అని అని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పెద్దవూరలో గురువారం టీఆర్ఎస్ గ్రామ ఇన్చార్జీలు, కో ఆర్డినేటర్లు, ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలోమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 35 ఏండ్లు ఎన్నో పదవులు అనుభవించిన జానారెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. నోముల నర్సింహయ్య గెలిచిన తర్వాతే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని, ఇంకా అభివృద్ధి జరుగాలంటే నోముల తనయుడు భగత్కు ఓటేసి గెలిపించాలని కోరారు. 1994లో జరిగిన ఎన్నికల్లో రామ్మూర్త్తి యాదవ్పై ‘నా చెప్పు పెట్టినా నేనే గెలుస్తా’ అని విర్రవీగిన జానారెడ్డికి ఆనాడు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. ఈ ఉప ఎన్నికల్లో కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
ప్రజలే గుణపాఠం చెబుతారు :మంత్రి జగదీశ్రెడ్డి
కృష్ణ పట్టె, ఎడమ కాల్వ చివరి భూములకు నీరివ్వలేని చరిత్ర గత పాలకులదని, సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలను జానారెడ్డి ఏనాడూ పట్టించుకోలేదని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులకు పదవుల మీద ఉన్న ప్రేమ ప్రజలపై లేదన్నారు. 19 ఏండ్ల కిందట తవ్విన వరద కాల్వకు గత ప్రభుత్వాలు నీళ్లివ్వలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలకే కాల్వ మరమ్మతులు చేయించి 60 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామని తెలిపారు. తమ ఏడేండ్ల పాలనలో చేపట్టిన ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. జానారెడ్డి చేసిందేమీలేదని, భవిష్యత్తులోనూ చేసేదేమీ లేదని, ఆయనకు ఓట్లడిగే అర్హత లేదని తెలిపారు. ఈ ఎన్నికతో జానారెడ్డికి రాజకీయం నుంచి ప్రజలే పదవి విరమణ చేస్తారని విమర్శించారు. జానారెడ్డి ఓటమిని అంగీకరించి అర్థంలేని మాటలతో ప్రజలను మోసగించాలని చూస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో భగత్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని కోరారు.
కాంగ్రెస్ ఖతం.. జానా గతం : ప్రభుత్వ విప్ బాల్క సుమన్
కాంగ్రెస్ పార్టీకి దేశంలో, రాష్ట్రంలో అధ్యక్షులు లేరని, ఆ పదవులు రాజీనామాలతో ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. గల్లీలో, ఢిల్లీలో అధికారంలో లేని కాంగ్రెస్కు ఓటు వేస్తే ఏం లాభమో? ప్రజలకు ఏం చేస్తారో చెప్పి ఓట్లడగాలని తెలిపారు. సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పారు. ‘కాంగ్రెస్ ఖతం..జానా గతం.. భగత్ భవిష్యత్’ అనే నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. అటు 77 ఏండ్ల పెద్ద మనిషి ఇటు 35 ఏండ్ల యువకుడికి పోటీ అని, గెలిచేది మాత్రం 305ఏండ్ల బుల్లెటే అని చమత్కరించారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మాట్లాడుతూ తన తండ్రి ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తానని, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజల కష్టాల్లో ఒకడినై అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంసీ కోటిరెడ్డి, గడ్డంపల్లి రవీందర్రెడ్డి, గోనె విష్ణువర్ధన్రావు, కర్ణ బ్రహ్మారెడ్డి, రావుల శ్రీధర్రెడ్డి, బీసీ సంఘం రాష్ట్ర మాజీ సభ్యుడు ఆంజనేయులుగౌడ్ ఎంపీపీ చెన్ను అనురాధాసుందర్రెడ్డి, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, పెద్దపల్లి, మంచిర్యాల జడ్పీ చైర్మన్లు ప్రవీణ్కుమార్, రవీందర్రెడ్డి, చవ్వ వెంకట్రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.
మునిగి పోయే నావా కాంగ్రెస్ పార్టీ : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా, జానారెడ్డికి ఓటేస్తే వృథానే అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సాగునీరు, రైతు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారిందని తెలిపారు. గతంలో పనిచేయని వారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతారని విమర్శించారు.
ఇవీ కూడా చదవండీ..
ధర్నాలో కూర్చున్న వారిపైకి దూసుకొచ్చిన కారు.. ఒకరు మృతి, ఎనిమిది మందికి గాయాలు
బొగ్గు అక్రమ రవాణా కేసులో సీబీఐ ఎదుట హాజరైన కింగ్పిన్ లాలా