ఆత్మకూర్. ఎస్ మండలం ఏపూరు జాతీయ స్థాయిలో మెరిసింది. మహిళా స్నేహ పూర్వక విభాగంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కాగా సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డుతోపాటు రూ.కోటి నగదు అందించారు. జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, సర్పంచ్ సానబోయిన రజిత, కార్యదర్శి ఉమారాణి అవార్డు స్వీకరణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్లో లైవ్లో చూసిన జిల్లా అధికారులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.
సూర్యాపేట, ఏప్రిల్ 17 : ఆత్మకూర్.ఎస్ మండలంలోని ఏపూరు పంచాయతీ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. అయితే అవార్డు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపూరు సర్పంచ్ సానబోయిన రజిత, అదనపు కలెక్టర్ పాటిల్ హే మంత్ కేశవ్, కార్యదర్శి ఉమారాణి అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సోమవారం ఉత్తమ పంచాయతీలకు అవార్డుల ప్రదానం జరిగింది. మహిళా స్నేహ పూర్వక విభాగంలో అవారు ్డ అందుకున్న ఏపూరు గ్రామానికి కలెక్టర్ వెంకట్రావ్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ప్రజావాణిలో ఢిల్లీ కార్యక్రమం లైవ్లో చూసి అవార్డు ప్రదానం సమయంలో కరతాల ధ్వనులతో శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రత్యేకంగా దత్తత తీసుకొని అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేశారని చెప్పారు. సూర్యాపేట జిల్లాకు అవార్డు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. అవార్డు అందుకున్న వారితోపాటు అవార్డు కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు.