దామరచర్ల, ఫిబ్రవరి 1: మండలంలో తాగునీటి ఎద్దడి తీవ్ర మవుతున్న దృష్ట్యా సాగర్ ఎడమ కాల్వ నీటితో చెరువులు నింపాలని మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నందిని ఆధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు నీటి ఎద్దడిపై ప్రస్తావించారు. మండలంలోని చెరువులన్నీ పూర్తిగా ఎండిపోయాయని, బోర్లల్లో భూ గర్భ జలాలు ఇంకి పోయి తాగునీటి సమస్య తీవ్రమవుతున్నదని పేర్కొన్నారు.
ప్రస్తుతం మిషన్ భగీరథ నీరొక్కటే దిక్కుగా మారిందన్నారు. ప్రస్తుతం సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసినందున ఆ నీటితో చెరువులు నింపి భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీడీఓ కృష్ణమూర్తి మాట్లాడుతూ మండలంలో నీటి సమస్య తలెత్తకుండా కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు నిత్యం పర్యవేక్షించాని ఆదేశించారు. వేసవిలో విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని ఎంపీపీ నందిని అధికారులను ఆదేశించారు. అనంతరం మండలంలోని 35 మంది సర్పంచులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆంగోతు లలిత, వైస్ ఎంపీపీ సైదులురెడ్డి, తాసీల్దార్ జవహర్లాల్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.