ఎండాకాలం సెలవులు ముగియడంతో నేటి నుంచి స్కూళ్లు పునః ప్రారంభం కానున్నాయి. దాదాపు
నెలన్నరపాటు ఆటపాటలతో సంతోషంగా గడిపిన పిల్లలు బడిబాట పట్టనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 4,381 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఐదు లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. సర్కారు స్కూళ్లకు సున్నాలు, రంగులు వేసి ముస్తాబు చేశారు. మన ఊరు-మనబడి, మన బస్తీ – మన బడి కార్యక్రమంతో స్కూళ్లు సరికొత్తగా మారాయి. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే స్కూళ్లకు పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ చేరగా తొలిరోజే అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
– రామగిరి, జూన్ 11
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం పునః ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 నుంచి ఈ నెల 11వరకు మూసివేసిన పాఠశాలల్లో తిరిగి నేటి నుంచి బడిగంట మోగనున్నది. విద్యార్థులంతా సెలవులకు టాటా చెప్పి ఇక బడికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంతేగాకుండా నూతనంగా తమ పిల్లలను బడిలో చేర్పించేందుకు శుభ గడియలు చూసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ‘మన ఊరు-మనబడి’, మన బస్తీ – మనబడి’తో ప్రభుత్వం పలు పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది సకల సౌలత్లు కల్పించింది. ఓ వైపు పాఠశాలలకు రంగులు వేసి ముస్తాబు చేస్తుండగా, మరో వైపు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫామ్ను జిల్లా విద్యాశాఖ సరఫరా చేసింది.
– రామగిరి/మునుగోడు, జూన్ 11
నేటి నుంచి 2023-24 విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా ఇక అన్ని పాఠశాలలు విద్యార్థులతో సందడిగా దర్శనమివ్వనున్నాయి. రోడ్లపై బడి బస్సులు రయ్ రయ్మంటూ తిరుగనున్నాయి. విద్యా క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన ఊరు-మనబడి’, మన బస్తీ-మనబడి’తో మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు కల్పించి సిద్ధం చేసి విద్యార్థులకు స్వాగతం పలుకనున్నారు. ఈ విద్యా సంవత్సరం మన ఊరు- మనబడిలో భాగంగా ప్రతి హైస్కూల్ విద్యార్థికి ఉచితంగా నోటు పుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా అందించనున్నది. అలాగే ప్రైమరీ విద్యార్థులకు వర్క్బుక్స్ ఇవ్వనున్నారు.
పాఠ్య పుస్తకాలు, యూనిఫాం రెడీ
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే పాఠ్య, నోటు పుస్తకాలు, 2 జతల యూనిఫాం సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ యాజమాన్యాలకు చెందిన 3,113 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు ఆయా జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠ్యపుస్తక విభాగం నుంచి మండలాల్లోని ఎంఆర్సీలకు, అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేశారు. ఇంకా కొన్ని పుస్తకాలు రావాల్సి ఉందని, అవి రాగానే అన్ని పాఠశాలలకు పూర్తి స్థాయిలో పంపిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అలాగే స్కూల్ యూనిఫామ్ను కూడా సిద్ధం చేశారు. బడి ప్రారంభమైన తొలిరోజే ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారు. యూడైస్లో ఎన్రోల్ అయిన ప్రతి విద్యార్థికి ఇవి అందనున్నాయి.
కొనసాగుతున్న బడిబాట..
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఎన్రోల్మెంట్ లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా ఈ నెల 3 నుంచి 17వరకు ప్రత్యేక కార్యాచరణతో బడిబాట నిర్వహిస్తూ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు ముస్తాబు..
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 4,381 పాఠశాలున్నాయి. వీటిలో 5 లక్షలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి నూతన విద్యా సంవత్సరంలో స్వాగతం పలికేలా పాఠశాలలను ముస్తాబు చేశారు. అంతేగాకుండా ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి సిద్ధం చేశారు.
‘మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్కారు బడుల్లో కార్పొరేట్, ప్రైవేట్కు దీటుగా సకల సౌకార్యాలు కల్పించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల్లో పనులు పూర్తికాగా మరికొన్ని పాఠశాలల్లో త్వరలోనే ముగియనున్నాయి. మరోవైపు గత సంవత్సరం ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి రావడంతో సర్కారు స్కూళ్లకు విద్యార్థులు క్యూ కడుతున్నారు.
తల్లిదండ్రులపై భారం తగ్గనుంది
ఈ సారి 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పుస్తకాలతోపాటు నోట్బుక్స్ కూడా ఇస్తామని మా సార్లు చెబుతున్నరు. ఈ నోట్బుక్స్తో మా తల్లిదండ్రులపై పైసల భారం తగ్గనున్నది. ప్రభుత్వం ఉచితంగా నోటు పుస్తకాలు ఇస్తామనడం సంతోషంగా ఉంది.
-జి.ప్రణీత్కుమార్, 8వ తరగతి, జడ్పీ ఉన్నత పాఠశాల, కొంపెల్లి, మునుగోడు
పిల్లలకు నోట్బుక్స్ ఇస్తాం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా వర్క్బుక్స్, నోట్బుక్స్ అందజేస్తామని సర్కారు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల తల్లిదండ్రులపై భారం తగ్గించేలా చర్యలు
చేపట్టడం శుభపరిణామం.
-కూకుంట్ల నర్సింహ, ఎంఈఓ, మునుగోడు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
ప్రభుత్వం, విద్యాశాఖ సూచించిన నిబంధనల ప్రకారం బడిబాటలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి. అలాగే పండుగ వాతావరణంలో పాఠశాలలను పునఃప్రారంభించి విద్యార్థులను స్వాగతించాలి. బడికి వచ్చిన ప్రతి విద్యార్థికి ఉచిత పాఠ్య, నోటు పుస్తకాలతోపాటు యూనిఫాం అందజేయాలి.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ