బొడ్రాయిబజార్, జనవరి 21 : దళిత మహిళను అయినందునే ప్రతిపక్షాలు తనపై అవిశ్వాస దాడి చేస్తున్నాయని, అందులో కౌన్సిలర్లు పావులు కావొద్దని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. పట్టణంలోని తన నివాసంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాలకు వచ్చానని.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి ఆశీస్సులతో చైర్పర్సన్ పదవి వచ్చిందని అన్నారు.
తనను చైర్పర్సన్గా బలపరిచిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో సూర్యాపేట పట్టణ సమగ్రాభివృద్ధికి విశేష కృషి చేశానని, కరోనా సమయంలో కూడా సేవలు అందించానని తెలిపారు. నాలుగేండ్లలో అవిశ్వాసం మాట తెలియదని, దళిత మహిళను అయినందునే తనపై అక్కసుతో ప్రతిపక్షాలు అవిశ్వాస దాడి చేస్తున్నాయని ఆరోపించారు. దళిత మహిళపై పెట్టిన అవిశ్వాసంతో దామోదర్రెడ్డి, సంకినేని, రమేశ్రెడ్డి చరిత్ర హీనులుగా మారనున్నారని అన్నారు.
అక్కా.. అంటే అర్ధరాత్రి కూడా పలికి పని చేశానని, దళితురాలినని పదవి నుంచి దించడం న్యాయమా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల రాజకీయ కుట్రలో కౌన్సిలర్లు పావులుగా మారొద్దని.. తప్పుడు మాటలు, దుష్ప్రచారం నమ్మి ఆగం కావద్దని సూచించారు. సమస్యలు ఉంటే మాట్లాడి పరిష్కరించుకుందామని, పట్టణ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, నాయకులు చొక్కయ్య, నాగభూషణం పాల్గొన్నారు.