నల్లగొండ, జనవరి 6 : నల్లగొండ బీఆర్ఎస్ కౌన్సిలర్లకు పార్టీ విప్ జారీ చేసినట్లు మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి శనివారం ఇన్చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ చైర్మన్గా కొనసాగుతున్న బీఆర్ఎస్కు చెందిన మందడి సైదిరెడ్డిపై అవిశ్వాసం కోరుతూ పలువురు కౌన్సిలర్లు గత నెల 22న కలెక్టర్కు నోటీస్ ఇచ్చారు. దాంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 8న ఉదయం 11:30 గంటలకు అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించనున్నారు.
అయితే.. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 20 మంది సభ్యులు కారు గుర్తుపై పోటీ చేసి కౌన్సిలర్లుగా గెలుపొందారు. వారిలో మెజార్టీ సభ్యులు ఇటీవల కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన కౌన్సిలర్లు ఇతరులకు మద్దతు ఇవ్వవద్దని ఆదేశిస్తూ పార్టీ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి కంచర్ల భూపాల్రెడ్డి ఇటీవల విప్ జారీ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పార్టీ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు.