నకిరేకల్, మార్చి 27 : గ్రామాల్లో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవీగంగాధర్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ట్రాన్స్ఫార్మర్ల కొరత ఉందని, అక్కడక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ అవసరమున్నాయని, ఉపాధి కూలీలకు వేసవి అలవెన్స్ అందజేయాలని, ఇంటి రిజిస్ట్రేషన్ కోసం నివాస ధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని అధికారులను ప్రజాప్రతినిధులు కోరారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ స్థానిక రైతుల బోర్లను లీజుకు తీసుకొని మంచినీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. వీలైనంత తొందరగా రైతుల నుంచి ధాన్యం సేకరించి వారి ఖాతాల్లో డబ్బు జమయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, ఎంపీఓ ఫర్వేజ్, పీఏసీఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్రావు, ఎంపీటీసీలు ఇమ్మడపాక లక్ష్మీవెంకన్న, బోయిళ్ల కిశోర్, యాస్మిన్, లోడె సాగర్, వీరార్జున్రెడ్డి, మండల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.